‘వాళ్ళు మొదట సైనికుల ధైర్యాన్ని ప్రశ్నించారు, ఇప్పుడు వ్యాక్సిన్లపై విమర్శలు చేస్తున్నారు’, కాంగ్రెస్ పై బీజేపీ మండిపాటు
భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పై కాంగ్రెస్ నేతలు ఆనంద్ శర్మ, శశిథరూర్, జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది.
భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పై కాంగ్రెస్ నేతలు ఆనంద్ శర్మ, శశిథరూర్, జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. అలాగే సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ని కూడా టార్గెట్ చేసింది. వీళ్లంతా మొదట మన సైనికుల ధైర్యాన్ని ప్రశ్నించారని, ఇప్పుడు ఇండియాలో తయారైన రెండు టీకా మందులకు డీసీజీఐ అనుమతినిస్తే అసంతృప్తిని, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారని కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి అన్నారు. జైరాం రమేష్, శశిథరూర్, అఖిలేష్ తమ అసలు స్వభావాలను చాటుకున్నారని, అందువల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. శాశ్వతంగా తమను రాజకీయాల నుంచి దూరం చేసుకోవాలన్నదే వీరి ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వీరిపై నిప్పులు కక్కారు. ఇండియా ఎప్పుడు ప్రజలకు మేలు చేసే శ్లాఘనీయమైన పని చేసినా దాన్ని వ్యతిరేకించేందుకు, అపహాస్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ లేనిపోని థియరీలతో ముందుకు వస్తుందని ఆయన ట్వీట్ చేశారు. వాళ్ళెంత వ్యతిరేకిస్తే అంత బయట పడతారని, ఇందుకు తాజా ఉదాహరణ కోవిడ్ వ్యాక్సిన్లేనని అన్నారు. తమ విఫల రాజకీయాలతో, దురుద్దేశపూరిత అజెండాలతో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రజల మనస్సులో భయోత్పాతాన్ని సృష్టించడానికి యత్నిస్తుంటాయని నడ్డా ఫైరయ్యారు. ఇతర రాజకీయాలు చేసుకోవాలని వారిని కోరుతున్నా.. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని అభ్యర్థిస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. భారత ప్రజలు ఈ విధమైన రాజకీయాలను తిరస్కరిస్తున్నారని, భవిష్యత్తులో కూడా వారు ఇలాగే మీ పాలిటిక్స్ ని ఛీ కొడతారని నడ్డా అన్నారు.