Bharat Bandh: రైతు చట్టాల అమలు మీ చలవే ! కాంగ్రెస్ సహా విపక్షాలపై కేంద్ర మంత్రి ఫైర్, నాడు మీరేం చేశారు ?
రైతుల ఆందోళనకు ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా మద్దతు పలుకుతూ గళమెత్తడంపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో..
రైతుల ఆందోళనకు ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా మద్దతు పలుకుతూ గళమెత్తడంపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ ను అనుమతిస్తూ ప్రైవేటీకరించిందని ఆయన అన్నారు. నాడు యూపీఏ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రైవేటీకరణకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన చెప్పారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ రకమైన కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానం మొదలైందన్నారు. అంతర్ రాష్ట్ర ట్రేడ్ వ్యవసాయ చట్టాన్ని కేంద్రం అమలు చేయవచ్చునని యూపీఏ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడే ప్రణాళికా సంఘం సిఫారసు చేసిందని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో మనం మెరుగుదల సాధించకపోతే రైతులకు ఆర్ధిక సాయం చేయబోమని నాడు శరద్ పవార్ హెచ్ఛరించారని, దీనిని సమాజ్ వాదీ పార్టీ, టీడీపీ, లెఫ్ట్ పార్టీలు కూడా సమర్థించాయని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
ఇది మీ ద్వంద్వ విధానం కాదా అని ఆయన ప్రశ్నించారు. రైతుల నుంచి గోధుమను సేకరించేందుకు కార్పొరేట్లను అనుమతించాలన్న శీర్షికతో పంజాబ్ నుంచి వెలువడే ఇంగ్లీష్ డైలీ ‘ట్రిబ్యూన్’ లో వచ్చిన ఆర్టికల్ ను బీజేపీ ప్రధాన కార్యదర్శి బీ.ఎల్. సంతోష్ ప్రస్తావించారు. 2008 లో అగ్రి-మార్కెటింగ్ లో కార్పొరేట్ సంస్థలను అనుమతించాలని పంజాబ్-హర్యానా రైతులు డిమాండ్ చేసిన విషయాన్ని ఈ వ్యాసం గుర్తు చేసిందని ఆయన చెప్పారు.