ద్వంద సభలతో ప్రయోజనాలు ఏంటి..? కేవలం శాసనసభతో ఎటువంటి ఫలాలు పొందవచ్చు..!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేయబోతుంది. మండలి రద్దు అంశంపై సీఎం విస్పష్ట ప్రకటన చేశారు. సోమవారం మండలి వ్యవస్థపై ప్రత్యేక చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ద్వంద సభల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి..? ఏక శాసనసభ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి..? అనే అంశాలు తెరపైకి వచ్చాయి. వాటిపై నిపుణులతో చర్చించి, పరిశోధనలు జరిపిన టీవీ9 కొన్ని కీలక విషయాలను మీకు తెలియపరచబోతుంది. ద్వంద్వ సభల ప్రయోజనాలు: 1.ఏక శాసనసభ […]
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేయబోతుంది. మండలి రద్దు అంశంపై సీఎం విస్పష్ట ప్రకటన చేశారు. సోమవారం మండలి వ్యవస్థపై ప్రత్యేక చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ద్వంద సభల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి..? ఏక శాసనసభ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి..? అనే అంశాలు తెరపైకి వచ్చాయి. వాటిపై నిపుణులతో చర్చించి, పరిశోధనలు జరిపిన టీవీ9 కొన్ని కీలక విషయాలను మీకు తెలియపరచబోతుంది.
ద్వంద్వ సభల ప్రయోజనాలు:
1.ఏక శాసనసభ వ్యవస్థలో కొనసాగే నియంతృత్వ ధోరణిని అరికడుతుంది. 2. తొందరపాటుతో తీసుకునే చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు రెండో సభ ఉపయోగపడుతుంది. సాధారణంగా దిగువ సభ తీవ్ర భావాలను ప్రతిబింబిస్తుంది. ఎగువ సభ తన మితవాద ధోరణితో దానికి అడ్డుకట్ట వేసి మధ్యే మార్గాన్ని అవలంబించటానికి దోహదం చేస్తుంది. 3. ప్రజా సమస్యలపై వివాదాలేర్పడినప్పుడు నిర్దుష్ట ప్రజాభిప్రాయాన్ని తీసుకోవటానికి వీలవుతుంది. రెండు సభల ఆమోదం పొందాలంటే కొంత జాప్యం జరుగుతుంది. ఆ సమయంలో ప్రజాభిప్రాయాన్ని రూపొందించవచ్చు. 4. ఎక్కువ సందర్భాల్లో ఎగువ సభ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటవుతుంది. దీనిలోని సభ్యులు అందరూ ఒకేసారి పదవీ విరమణ పొందరు. రెండేళ్లకోసారి కొంత శాతం సభ్యులు పదవీ విరమణ చేయడం, ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించి కొత్తవారిని ఎన్నుకోవడం సాధారణంగా అనుసరించే పద్ధతి. ఈ పద్ధతిలో మారుతున్న ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తుంది. 5. అల్ప సంఖ్యాక వర్గాలకు, మేధావులకు, విద్వత్ వర్గాలకు ప్రాతినిధ్యమివ్వటానికి వీలవుతుంది. ఎగువ సభ ద్వారా వీరికి ప్రాతినిధ్యం కల్పించవచ్చు. 6. ఆధునిక కాలంలో శాసన నిర్మాణం క్లిష్టతరమైనది. కాలయాపనతో కూడినది. ద్వంద్వశాసన సభా విధానం ద్వారా పని భారం తగ్గుతుంది. త్వరిత గతిన శాసనాలు రూపొందించవచ్చు. అంతేకాకుండా ఒక సభ ఆమోదించిన బిల్లును రెండో సభ సమీక్షిస్తూ దానిలోని లోటు పాట్లను సవరిస్తుంది. 7. సమాఖ్య వ్యవస్థ ఉన్న ఇండియా, అమెరికా వంటి దేశాల్లో రాష్ట్రాలకు కేంద్ర శాసన సభలో ప్రాతినిధ్యం ఇవ్వటానికి ద్వంద్వ శాసనసభ అవసరం. అదే విధంగా మన దేశంలో విధాన పరిషత్ ద్వారా స్థానిక ప్రభుత్వాలకు రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం కలుగుతుంది. ప్రపంచంలో ఎక్కువ దేశాలు ద్వంద్వ శాసన సభ విధానాన్ని అనుసరించడమే అ వ్యవస్థ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తున్నాయి.
ఏక శాసన సభ ప్రయోజనాలు 1. వ్యవస్థీకరణ సులభం, జవాబుదారీతనాన్ని స్పష్టంగా నిర్దేశించవచ్చు. 2. అనవసర జాప్యం ఉండదు. 3. ఘర్షణను నివారించవచ్చు. 4. నిర్వహణ ఖర్చు తక్కువ. వర్ధమాన దేశాలు ఉభయ శాసన సభలను నిర్వహించలేవు. 5. ప్రభావ వర్గాల ప్రాతినిధ్యానికి రెండో సభ ఉండాలనే నిబంధన ఏమీ లేదు. ఏక శాసన సభల్లో కూడా నామినేషన్ పద్ధతి ద్వారా ప్రాతినిధ్యం కల్పించవచ్చు. 6. ఎగువ శాసన సభలు సాధారణంగా మితవాద భావాలు కలిగి, ప్రగతి నిరోధకాలుగా వ్యవహరిస్తాయి. ఆ సమస్య ఏక శాసన సభలో ఉండదు. 7. సమాఖ్య వ్యవస్థలో ప్రాంతీయ ప్రభుత్వాల ప్రాతినిధ్యానికి ఎగువ సభ అవసరమన్న వాదనలో పస లేదు. ప్రస్తుతం శాసన సభలు పార్టీ ప్రాతిపదికన పని చేస్తున్నాయి. ఎగువ సభకు ఎన్నికైన సభ్యులు కూడా పార్టీ నిర్దేశాల మేరకే ఓటు వేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న దాఖలాలు లేవు. రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటంలో దిగువ సభ ఏ మాత్రం తీసిపోదు.