కనకదుర్గమ్మ సారె మహోత్సవం..స్లాట్ బుక్ చేసుకుంటేనే..
ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా విజయవాడ దుర్గమ్మకు నేటి నుంచి భక్తుల సారె సమర్పణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలి ఆషాడమాస సారెను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమర్పించారు.
ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా విజయవాడ దుర్గమ్మకు నేటి నుంచి భక్తుల సారె సమర్పణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలి ఆషాడమాస సారెను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమర్పించారు. పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, కార్య నిర్వహణాధికారి సురేష్బాబు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మినిస్టర్ వెల్లంపల్లి మాట్లాడుతూ.. అమ్మవారికి ఆషాఢ మాసం సారె అందజేయడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్లాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు వివరించారు.
కాగా జులై 20వ తేదీ వరకు భక్తులు అమ్మవారికి సారె సమర్పించవచ్చని ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. చివరి రోజున వైదిక కమిటీ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మకు సారెను సమర్పిస్తారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో అమ్మవారికి సారె సమర్పించదలిచిన భక్తులు, సంస్థలు.. ఉదయం 6 గంటల నుంచి 5.00 గంటల లోపు ఆన్లైన్లో(www.kanakadurgamma.org) దర్శనం శ్లాట్ బుక్ చేసుకుని రావాలని అధికారులు సూచించారు. వచ్చే భక్తులందరూ కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.