అరుణాచల్ డిప్యూటీ సీఎం ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
ఇటానగర్ : స్థానికేతరులకు రాష్ట్రప్రభుత్వం శాశ్వత పర్మనెంట్ రెసిడెంట్ ధృవీకరణ పత్రాలు మంజూరు చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతుండటంతో అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలో మూడురోజులుగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనకారులు ఇటానగర్లో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ బంగ్లాను తగులబెట్టారు. దీంతో ఆయన అక్కడ నుంచి ఆదివారం ఉదయం నామ్సాయ్ జిల్లాకు మకాం మార్చారు. దీంతోపాటుగా జిల్లా కమిషనర్ నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. మరో ఎస్పీ ర్యాంకుస్థాయి అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. […]
ఇటానగర్ : స్థానికేతరులకు రాష్ట్రప్రభుత్వం శాశ్వత పర్మనెంట్ రెసిడెంట్ ధృవీకరణ పత్రాలు మంజూరు చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతుండటంతో అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలో మూడురోజులుగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనకారులు ఇటానగర్లో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ బంగ్లాను తగులబెట్టారు. దీంతో ఆయన అక్కడ నుంచి ఆదివారం ఉదయం నామ్సాయ్ జిల్లాకు మకాం మార్చారు. దీంతోపాటుగా జిల్లా కమిషనర్ నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. మరో ఎస్పీ ర్యాంకుస్థాయి అధికారి తీవ్రంగా గాయపడ్డాడు.
రాష్ట్రప్రభుత్వం నియమించిన ఓ కమిటీ అరుణాచల్ప్రదేశ్లో దశాబ్దాలుగా నివసిస్తున్న స్థానికేతర కుటుంబాలకు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాల్సిందిగా సిఫారసు చేసింది. దీంతో శుక్రవారం నుంచి అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందడం పరిస్థితులు మరింతగా అదుపుతప్పడానికి కారణమైంది. నిరసనకారులు దాదాపు 50కార్లకు నిప్పంటించారు. 100కు పైగా వాహనాలను ధ్వంసం చేశారు. ఇటానగర్లో అయిదు థియేటర్లను తగులబెట్టారు. నాగాలాండ్ నుంచి వచ్చిన ఓ మ్యూజిక్బ్యాండ్ బృందంపైనా దాడిచేసి, సంగీతపరికరాలు, వారి వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. రాజధాని వీధుల్లో కవాతు నిర్వహించాయి. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్.. ముఖ్యమంత్రి పెమా ఖండూతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రప్రజలు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఇటానగర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, కర్ఫ్యూ విధించారు.