జగన్ సర్కార్ కీలక నిర్ణయం…వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమకు రంగం సిద్దం
అసలే ఆర్థిక సంక్షోభం..ఆపై కరోనా కష్ట కాలం..అయినా ఏపీ సీఎం జగన్ వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా ఆయన సంక్షేమం విషయంలో ఫుల్ ఫోకస్ పెట్టారు.
అసలే ఆర్థిక సంక్షోభం..ఆపై కరోనా కష్ట కాలం..అయినా ఏపీ సీఎం జగన్ వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా ఆయన సంక్షేమం విషయంలో ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రెండోవ విడత ‘వైఎస్ఆర్ వాహనమిత్ర’ పథకం క్రింద ఆర్థిక సాయం చేసిన ఏపీ ప్రభుత్వం..తాజాగా కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తోన్న వెనకబడిన వర్గాలకు సాయం చేసేందుకు సిద్దమైంది. నాయీబ్రాహ్మణ, రజక, టైలర్(దర్జీ)ల సంక్షేమం కోసం ‘జగనన్న చేదోడు’ పేరుతో ఆర్థిక సహాయం చేయబోతుంది. షాపులున్న నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని సర్కార్ అందజేయనుంది. సీఎం జగన్ క్యాంప్ ఆఫీసులో బుధవారం ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే రూ.154.31 కోట్లు రిలీజ్ చేస్తూ ఏపీ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పథకంలో భాగంగా ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. మొత్తం 2,47,040 మంది లబ్ధిదారులకు రూ.247.04 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. 1,25,926 మంది టైలర్లకు, 82,347 మంది రజకులకు, 38,767 మంది నాయీబ్రాహ్మణులకు.. ఈ లబ్ధి చేకూరనుంది.