తుఫానుపై ఏపీ అప్రమత్తం.. జగన్ డైరెక్షన్స్ ఇవే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరానికి పొంచి వున్న తుఫాను ముప్పును ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తుఫాను తీవ్రతను సరిగ్గా అంచనా వేయాలని, దాని కదలికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరానికి పొంచి వున్న తుఫాను ముప్పును ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తుఫాను తీవ్రతను సరిగ్గా అంచనా వేయాలని, దాని కదలికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంఫామ్ తుఫాను ఏపీ వైపు మళ్లే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి సోమవారం సమీక్షించారు.
విద్యుత్తు, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ సర్వసన్నద్ధం కావాలని, తుఫాను ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సముద్రంలో వేటపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించి ఏ ఒక్క బోటు కూడా సముద్రంలోకి వెళ్ళకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు.
తుఫానును ఎదుర్కొనేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసి తన ముందుకు రావాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. తుఫాను ఆగమనాన్ని దృష్టిలో పెట్టుకొని ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం చెప్పారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వీలైనంత వరకు కొనుగోలు చేయాలని, తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ధాన్యం సేకరణలో వేగం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.