వివాదంలో సింహాచలం.. ‘భ్రమరాంబ లేఖాస్త్రం’
సింహాచలం ఆలయాన్ని మరో వివాదం చుట్టేస్తోంది. ఆలయానికి సంబంధంలేని వ్యక్తి కొండపై అజమాయిషీ చేస్తుండడం ప్రశ్నార్థకంగా మారింది. ఆయనకు సకల సౌకర్యాలు కల్పించడానికి..
సింహాచలం ఆలయాన్ని మరో వివాదం చుట్టేస్తోంది. ఆలయానికి సంబంధంలేని వ్యక్తి కొండపై అజమాయిషీ చేస్తుండడం ప్రశ్నార్థకంగా మారింది. ఆయనకు సకల సౌకర్యాలు కల్పించడానికి ఆలయ నిధులను ఖర్చు చేయాల్సి రావడంపై.. సింహాచలం ఆలయ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజుకు ఘాటుగా లేఖ రాశారు ఇంతకుముందు ఈవోగా పని చేసిన భ్రమరాంబ.
ఈ నెల ఒకటో తేదీన భ్రమరాంబ బదిలీ అయ్యారు. దానికి రెండు రోజుల ముందు ఆగస్టు 30న చైర్పర్సన్ సంచయితకు భ్రమరాంబ లేఖ రాశారు. ఇదే లేఖను దేవాదాయశాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకూ ఆమె పంపినట్లు తెలుస్తోంది. సంచయిత సిఫార్సుతో కార్తీక సుందరరాజన్ సింహాచలంలో మకాం వేశారు. ఆయనకు కొండపై 2 ఏసీ గదులతో ఉండే అన్నపూర్ణ కాటేజ్ను కేటాయించారు. మే 30 నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. ఆయనకు ప్రతీరోజు టీ,టిఫిన్స్, భోజనాలను ఆలయమే సమకూర్చుతోంది. దీనికోసం ప్రత్యేకంగా ఐదుగురు సిబ్బందినీ కేటాయించింది. అటు ఆలయ వ్యవహారాల్లోనూ ఆయన జోక్యం చేసుకుంటున్నారు. ఛైర్పర్సన్ చెప్పారంటూ పరిపాలన, భూ విభాగాల రికార్డులను తెప్పించుకుని ఆయన పరిశీలిస్తున్నారు.
ఆలయ భూ పరిరక్షణ విభాగానికి ఉన్న వాహనాన్ని తనకు అవసరం ఉన్నప్పుడల్లా సుందరరాజన్ ఉపయోగించుకుంటున్నారు. వంట తదితర పనులకు అయిదుగురు సిబ్బందిని వినియోగిస్తున్నారు. దీన్ని ప్రశ్నిస్తూనే సంచయితకు భ్రమరాంబ లేఖ రాశారు. ఆలయంలో ఎలాంటి హోదాలోనూ లేని వ్యక్తికి.. ఆలయ ఖర్చుతో ఎందుకు సౌకర్యాలు కల్పించాలంటూ అడిగారు.
అయితే.. తనకు ఓఎస్డీగా సుందరరాజన్ను నియమించుకోవాలని సంచయిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల జరిగిన పాలకవర్గ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. అందులో ఆయనకు జీతం, వాహనం, ఇతర వసతులను సమకూర్చాలని పేర్కొన్నారు. దీనిపై తొలుత సభ్యులు అభ్యంతరం తెలిపినా తరువాత నిబంధనలు ఎలా ఉంటే అలా చేయాలని నిర్ణయించారు. నిబంధనల మేరకు బయటి వారిని ఇలా నియమించే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. భ్రమరాంబ లేఖ రాయడం.. హాట్టాపిక్గా మారింది.