డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్లిన నిండు గర్భిణి… శవమై బయటకు వచ్చింది..
పండంటి బిడ్డ పుడతాడని గంపెడాశతో ఆసుపత్రికి వెళ్లిన ఓ జంట వైద్యులు చేసిన నిర్వాకానికి ఆ కుటుంబంలో తీవ్ర విషాదానన్ని నింపింది. తొమ్మిది నెలలు మోసి డెలివరీ కోసం తీసుకువచ్చిన భార్యను.. కొవిడ్ అని చెప్పి.. చికిత్స పేరుతో రూ.29 లక్షలు వసూలు చేశారు. చివరకు ఆమె మృతదేహాన్ని అప్పగించారని ఓ బాధితుడు ఆవేదన చెందుతున్నాడు.
పండంటి బిడ్డ పుడతాడని గంపెడాశతో ఆసుపత్రికి వెళ్లిన ఓ జంట వైద్యులు చేసిన నిర్వాకానికి ఆ కుటుంబంలో తీవ్ర విషాదానన్ని నింపింది. తొమ్మిది నెలలు మోసి డెలివరీ కోసం తీసుకువచ్చిన భార్యను.. కొవిడ్ అని చెప్పి.. చికిత్స పేరుతో రూ.29 లక్షలు వసూలు చేశారు. చివరకు ఆమె మృతదేహాన్ని అప్పగించారని ఓ బాధితుడు ఆవేదన చెందుతున్నాడు.
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం బల్సురుగొండకు చెందిన మాధవరెడ్డి భార్య శ్వేతారెడ్డి ఇటీవలే గ్రూపు-2లో ఏసీటీవోగా ఎంపికై హైదరాబాద్లో విధులు నిర్వర్తిస్తున్నారు. నిండు గర్భిణి అయిన ఆమెకు జులై 27న స్వల్పంగా జ్వరం రావడంతో మహబూబ్నగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపిస్తే మాత్రలు ఇచ్చి పంపించారు. అదేనెల 29న కోస్గిలోని ఓ ఆస్పత్రిలో చూపించినా జ్వరం తగ్గలేదు. దీంతో ఆగస్టు 3న కాన్పు కోసం మహబూబ్నగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా దగ్గు వస్తున్నందున కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. స్థానిక జనరల్ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకుంటే ఆమెకు నెగటివ్ వచ్చింది. అయినా అక్కడి ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడంతో హైదరాబాద్ కు చేరుకున్నారు.
ఆగస్టు 4న డెలివరీ కోసం హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు కుటుంబసభ్యులు. అక్కడ మొదట రూ. 2 లక్షలు కడితేనే సిజేరియన్ చేస్తామని చెప్పడంతో వెంటనే డబ్బులు చెల్లించారు. మగశిశువుకు జన్మించింది శ్వేతారెడ్డి. డెలివరీ అయిన రెండు రోజుల తరువాత శ్వేతారెడ్డికి కొద్దిగా ఆయాసం రావడంతో కొవిడ్ పరీక్షలు చేయాలని నమూనాలు సేకరించారు. ఫలితం నివేదిక చూపించకుండానే పాజిటివ్ వచ్చిందని వైద్యులు చెప్పారు. ఎలాగైనా సరే నయం చేయాలంటూ కుటుంబ సభ్యులు వైద్యులను వేడుకున్నారు. దీంతో ఆగస్టు 12న ఆమెను ఐసీయూకు తరలించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. డబ్బులు కడితేనే సరైన ఆరోగ్యం అందుతుందంటూ తరచూ రూ. లక్షల్లో ఫీజులు కట్టించుకున్నారు. ఇలా 20 రోజుల పాటు ఐసీయూలోనే ఉంచారు. వైద్యులను సంప్రదిస్తే పరిస్థితి బాగానే ఉందని చెబుతూ వచ్చారు.
చివరకు మాధవరెడ్డి తన భార్యను చూపెట్టాలని పట్టుబట్టడంతో బుధవారం మధ్యాహ్నం పీపీఈ కిట్ ఇచ్చి ఐసీయూలోకి పంపించారు. అక్కడ తన భార్య కళ్లతో చూడటం తప్పిస్తే ఎవరినీ గుర్తించే స్థితిలో లేదని మాధవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆమె పరీక్షల నివేదికలు ఇవ్వాలని, వేరే వైద్యుల అభిప్రాయం తీసుకుంటామని చెప్పడంతో చివరకు గురువారం తెల్లవారుజామున ఆమె మృతి చెందిందంటూ ఆసుపత్రి సిబ్బంది ప్రకటించారని భర్త ఆరోపించారు. దాదాపు రూ.29 లక్షలు ఖర్చు చేసినా తన భార్యకు అందించిన చికిత్స వివరాలు తెలపాలేదని అవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేట్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ డీఎంహెచ్వోకు ఫిర్యాదు చేశామన్నారు భర్త మాధవరెడ్డి.