‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మూవీ రివ్యూ

టైటిల్ : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ జానర్ : బయోగ్రాఫికల్‌ మూవీ తారాగణం : విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్‌ సంగీతం : కల్యాణ్ మాలిక్‌ దర్శకత్వం : రామ్‌ గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు నిర్మాత : రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ  తెరకెక్కించిన సెన్సేషనల్ మూవీ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. రిలీజ్‌కు ముందు అనేక వివాదాలకు దారితీసిన ఈ మూవీ ఆంధ్రప్రదేశ్‌లో కోర్టు ఆర్డర్ల వల్ల నిలిచిపోగా..మిగతా అన్ని ప్రాంతాల్లో థియేటర్లను హిట్ చేసింది. తెలుగు […]

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' మూవీ రివ్యూ
Follow us

|

Updated on: Mar 29, 2019 | 4:32 PM

టైటిల్ : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ జానర్ : బయోగ్రాఫికల్‌ మూవీ తారాగణం : విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్‌ సంగీతం : కల్యాణ్ మాలిక్‌ దర్శకత్వం : రామ్‌ గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు నిర్మాత : రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ  తెరకెక్కించిన సెన్సేషనల్ మూవీ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. రిలీజ్‌కు ముందు అనేక వివాదాలకు దారితీసిన ఈ మూవీ ఆంధ్రప్రదేశ్‌లో కోర్టు ఆర్డర్ల వల్ల నిలిచిపోగా..మిగతా అన్ని ప్రాంతాల్లో థియేటర్లను హిట్ చేసింది. తెలుగు వెండితెరకు పలు క్రేజీ మూవీస్‌ను అందించిన రామ్‌గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని డైరక్ట్ చెయ్యడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలను తీసుకొని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో సినిమాను తెరకెక్కించాడు వర్మ.  ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించాక జరిగిన సంఘటనల చుట్టూ సినిమా తిరుగుతుంది. మరి ఈ మూవీ ఆడియెన్స్‌ను ఏ మేరకు అలరించిందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

కథ:

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ కథ ఇప్పటి తరానికి  తెలియకపోవచ్చు కాని..పాత తరానికి తెలిసిన వెండితెర ఇలవేల్పు ఎన్టీఆర్ కథే.  జీవిత చరమాంకంలో 1989 వ సంవత్సరంలో ఎన్టీఆర్(విజయ్ కుమార్‌)  అధికారం కోల్పోయాక ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో ఆయన జీవిత చరిత్రను రాసేందుకు లక్ష్మి పార్వతి (యజ్ఞ శెట్టి)  వస్తుంది. ఆవిడ యెక్క అర్హతలు తెలుసుకున్న ఎన్టీఆర్ అందుకు సమ్మతిస్తాడు. ఇదే అదునుగా భావించిన కొందరు ఆవిడను నెగటీవ్‌గా చిత్రీకరించే కుట్ర చేస్తారు. ఈ విషయాల గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ తీవ్రమైన ఆలోచనలకు లోనవుతారు.  అలా మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్ సమయంలో ఎన్టీఆర్.. లక్ష్మి పార్వతిని వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటిస్తారు. ఈ వివాహన్ని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎన్టీఆర్ అల్లుడు బాబ్ రావ్..ఓ పత్రికాధిపతితో కలిసి లక్ష్మి పార్వతిని నెగెటివ్ గా చూపించే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో 1994 ఎన్నికలు వస్తాయి.  ఈ ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ లక్ష్మి పార్వతితో కలిసి ప్రచారం చేసి భారీ మెజారిటీతో గెలిచి తిరిగి అధికారం చేపడతారు.  ఆ తరువాత ఆ కుటుంబంలో అనేక మార్పులు జరుగుతాయి.  ఎన్టీఆర్ కుటుంబంలోని ముఖ్యులంతా అల్లుడు పక్షాన చేరిపోతారు. వాళ్లతో కలిసి పార్టీని, అధికారాన్ని చేజిక్కించుకుంటారు. ఆ తరువాత ఏం జరిగింది…? వైస్రాయ్ హోటల్ ఉదంతం ఏంటి ?ఎన్టీఆర్ మరణానికి దారితీసిన పరిణామాలు ఏంటి అన్నది మిగతా కథ.

విశ్లేషణ : ముందు నుంచి  ఈ సినిమాలో నిజాలను ప్రేక్షకుల ముందు ఉంచుతాను అని చెప్పిన వర్మ.. తాను తెలుసుకుంది పూసగుచ్చినట్టు చెప్పే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్‌ అనే మహానాయకుడు ఎలా ఒంటరి వాడయ్యాడు.? ఆ సమయంలో లక్ష్మీకి ఎలా దగ్గరయ్యాడు.? వారిద్దరి మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది.? లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్‌ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది.? ఆ కుట్రల వెనుక ఉన్న అసలు మనుషులు ఎవరు? చివరకు ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? అన్న విషయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. వర్మ మార్క్‌ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. చాలా కాలం తర్వాత వర్మ మూవీ మేకింగ్‌పై బాగా ఆసక్తి కనపర్చినట్టు అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్, లక్ష్మి పార్వతిల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.  ఈ సన్నివేశాలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచాయి.  ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ భాగం వీరిద్దరి చుట్టే నడుస్తుంది.  సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవుతుంది.  సెకండ్ హాఫ్ ను వర్మ చాలా తెలివిగా డీల్ చేశాడు వర్మ. కళ్యాణి మాలిక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది.

నటీనటులు :

పాత్రల ఎంపిక విషయంలో వర్మ తీసుకునే శ్రద్ధ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధ్యమైనంతవరకు బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో ఈ మూవీలో వర్మ పనితనం గ్రేట్ అని చెప్పాలి.  ఎన్టీఆర్ గా పి. విజయ్ కుమార్ అనే వ్యక్తిని తీసుకోవడంతోనే వర్మ సగం సక్సెస్ అయ్యాడు. రంగస్థలంపై నటించిన అనుభవమున్న విజయ్ నటన అచ్చు ఎన్టీఆర్ ను తలపించింది. హావభావాలు, ఎమోషన్స్ పలికించే విధానంలోనూ విజయ్ తడుముకోకుండా ఎన్టీఆర్‌ను ప్రజలకు గుర్తుచేశాడు.  అటు లక్ష్మి పార్వతి పాత్రలో నటించిన యజ్ఞాశెట్టి జీవించింది. ఆవిడ ఎమోషన్స్‌ను పలికించిన విధానం ఆకట్టుకుంటుంది. చంద్రబాబు పాత్ర చేసిన శ్రీతేజ్ సినిమాకు హైలైట్ గా నిలిచాడు.  మిగతా పాత్రల్లో ఇతరులు  పాత్రల పరిధి మేర మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు: 

వర్మ తన వే ఆఫ్ టేకింగ్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశాడు.  తను నమ్మింది జనాలకు బలంగా చెప్పే ప్రయత్నం ఆకట్టుకుంటుంది. రమ్మీ అందించిన ఫోటోగ్రఫి చాలా కొత్తగా ఉంది. కళ్యాణి మాలిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు డబుల్ ప్లస్ అయింది.  నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ సెన్స్‌లో వర్మని మించిన మరో దర్శకుడు తెలుగు తెరకు ఇప్పటివరకు దొరకలేదనే చెప్పుకోవాలి ఆయన శిష్యుడు పూరి జగన్నాథ్ మినహా.

ఫైనల్ థాట్: ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఫక్తు వర్మ మార్క్ మూవీ.