ఓ కథ ముగిసింది.. ఓ చరిత్రకు ఎండ్ కార్డ్ పడింది. 94 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (LVB) శుక్రవారం నుంచి తన కార్యకలాపాలను డీబీఎస్ బ్యాంక్ ఇండియాగా నిర్వహించడం మొదలు పెట్టింది.
దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే బ్యాంకింగ్ సేవలు అందిస్తూ వచ్చిన ఈ తమిళనాడు బ్యాంకు.. డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్లో (డీబీఐఎల్) మెర్జ్ అయ్యింది. దీంతో లక్ష్మీ విలాస్ బ్యాంక్ తన గుర్తింపును కోల్పోయింది.
డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో ఎల్వీబీ విలీనం నవంబరు 27 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎల్వీబీ శాఖలన్నీ.. డీబీఐఎల్ శాఖలుగా కార్యకలాపాలు నిర్వహిస్తాయని కూడా చెప్పింది. మారటోరియం కూడా శుక్రవారం నుంచి ఉండదని ఆర్బీఐ పేర్కొన్న సంగతి విదితమే. ఎల్వీబీ విలీన పథకాన్ని అనుసరించి ఈ బ్యాంకు షేర్లను ఎక్స్ఛేంజీల నుంచి తొలగించారు.