తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ కేవీపీ కలకలం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ ఏర్పాటును గట్టిగా ప్రతిఘటించిన వారిలో ఏపీ నేత, దివంగత వైఎస్ఆర్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు ఒకరు. గత అయిదున్నరేళ్ళుగా తెలంగాణకు ఆ మాటకొస్తే.. మొత్తం రాజకీయాలనే అంటీముట్టనట్లున్న కేవీపీ తాజాగా తెలంగాణ పాలిటిక్స్‌లో తళుక్కున మెరిశారు. మెరవడమంటే ఆషామాషీగా కాదు.. ఓ మునిసిపాలిటీ ఎన్నికను ప్రభావితం చేసే లెవెల్లో ఆయన ఎంట్రీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. కేవీపీ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆయన రాజ్యసభ సభ్యత్వ […]

తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ కేవీపీ కలకలం
Follow us

|

Updated on: Jan 27, 2020 | 1:17 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ ఏర్పాటును గట్టిగా ప్రతిఘటించిన వారిలో ఏపీ నేత, దివంగత వైఎస్ఆర్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు ఒకరు. గత అయిదున్నరేళ్ళుగా తెలంగాణకు ఆ మాటకొస్తే.. మొత్తం రాజకీయాలనే అంటీముట్టనట్లున్న కేవీపీ తాజాగా తెలంగాణ పాలిటిక్స్‌లో తళుక్కున మెరిశారు. మెరవడమంటే ఆషామాషీగా కాదు.. ఓ మునిసిపాలిటీ ఎన్నికను ప్రభావితం చేసే లెవెల్లో ఆయన ఎంట్రీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

కేవీపీ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆయన రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం ముగియబోతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పెద్దలసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను తెలంగాణకు కేటాయించారు. దాంతో ఆయన తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మాదిరిగానే ఎంపీలకు కూడా మునిసిపాలిటీల్లో కోఆప్షన్ మెంబర్‌షిప్ వుంటుంది. ఈ నేపథ్యంలో కేవీపి తనకు ఇష్టం వచ్చిన ఏదో ఒక మునిసిపాలిటీ లేదా మునిసిపల్ కార్పొరేషన్‌లో ఛైర్మెన్, మేయర్ ఎన్నికలో తన ఓటు హక్కును వినియోగించుకునే ఛాన్స్ వుంది.

జనవరి 25న వెల్లడైన తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత ఫేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ కొన్ని మునిసిపాలిటీల్లో నెంబర్ గేమ్ నెరపే అవకాశం ఆ పార్టీకి దక్కింది. ఈ కోవలోకి వచ్చేదే సూర్యపేట జిల్లా నేరెడుచర్ల మునిసిపాలిటీ. ఇక్కడ మొత్తం 15 వార్డులుండగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చెరి 7 సీట్లలో గెలుపొందాయి. సీపీఎం పార్టీ మరో సీటు గెలుచుకుంది. సీపీఎం.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించగా.. ఛైర్మెన్ పదవిని దక్కించుకునేందుకు టీపీసీసీ అధ్యక్షుడు కొత్త ఎత్తు వేశారు. తాను లోక్ సభ సభ్యుని హోదాలో నేరెడుచర్ల మునిసిపాలిటీలో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకొచ్చారు. తనతోపాటు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కూడా ఇక్కడే ఎక్స్‌అఫీషియో మెంబర్ ఓటు వేసేందుకు లేఖ సమర్పించారు. దాంతో కాంగ్రెస్ పార్టీ బలం 10కి చేరింది. దాంతో చాలా ఈజీగా ఛైర్మెన్ సీటు దక్కించుకోవచ్చని ఉత్తమ్ కుమార్ ఎత్తు వేశారు.

అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీ ఎత్తుకుపైఎత్తు వేసింది. తాము గెలిచిన ఏడుగురు కౌన్సిలర్లకు ఓ ఎమ్మెల్యేను, ఇద్దరు ఎమ్మెల్సీలను జత చేసి.. మొత్తం పది స్థానాలతో ఛైర్మెన్ పదవిని దక్కించుకునేందుకు ప్లాన్ చేసింది. కానీ కేవీపీ రూపంలో కాంగ్రెస్ పార్టీ కూడా పది మంది సభ్యుల బలం కూడగట్టడంతో టీఆర్ఎస్ పార్టీ పునరాలోచన చేసింది. ఈ క్రమంలోనే హైడ్రామాకు తెరలేచింది. కేవీపీ పేరును జాబితా నుంచి జిల్లా కలెక్టర్ తొలగించారు. దాంతో కాంగ్రెస్ నేతలు ఆదివారం రాత్రి ధర్నాలతో హోరెత్తించారు. సోమవారం ఉదయాన్నే కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డిని కల్వడంతో ఆయన కేవీపీ ఓటు హక్కును ధృవీకరించారు. ఈసీ నిర్ణయంతో రెండు పార్టీల బలాలబలాలు పదితో సమానంగా మారాయి.

ఛైర్మెన్ ఎన్నిక కోసం మంగళవారం మరోసారి కౌన్సిల్‌ను సమావేశపరచాలని నిర్ణయించారు. అయితే.. ఆ తర్వాత గంటసేపటికే అత్యంత నాటకీయ పరిణామాల నడుమ కేవీపీ పేరును జాబితా నుంచి మళ్ళీ తొలగించి.. సోమవారం సాయంత్రమే ఛైర్మెన్ ఎన్నికను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కేవీపీ ఓటు తిరస్కరించడంతో ప్రస్తుతం టీఆర్ఎస్ బలం 10, కాంగ్రెస్ పార్టీ బలం 9గా మారిపోయింది. దాంతో తన ఓటు కోసం కోర్టుకెక్కేందుకు కేవీపీ సమాయత్తమవుతున్నట్లు సమాచారం.