ఆందోళన అవసరం లేదు..కంటైన్మెంట్ జోన్ల‌లో ప‌ర్య‌టించిన మంత్రి కేటీఆర్‌..

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఈరోజు హైదరాబాద్ లోని ప‌లు కంటైన్మెంట్ జోన్‌ల‌లో పర్యటించారు. ఖైరతాబాద్ పరిధిలోని ..

ఆందోళన అవసరం లేదు..కంటైన్మెంట్ జోన్ల‌లో ప‌ర్య‌టించిన మంత్రి కేటీఆర్‌..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 16, 2020 | 4:02 PM

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఈరోజు హైదరాబాద్ లోని  ప‌లు కంటైన్మెంట్ జోన్‌ల‌లో పర్యటించారు. ఖైరతాబాద్ పరిధిలోని సిఐబి క్వార్టర్స్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి కంటైన్మెంట్‌ జొన్లను సందర్శించిన మంత్రి కేటీఆర్ అక్కడి ప్రజలతో మాట్లాడారు. వైర‌స్ విస్త‌రిస్తోన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్ని కాపాడేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని పరిమితులు విధించిందని, అందులో భాగంగానే కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు.ఈ సందర్భంగా పలువురితో ఆయన మాట్లాడారు. ఆయా కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ పట్ల అవగాహన ఉన్నదా, ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రచురించిన కరపత్రాలు, ఇతర సమాచారం మీకు చేరిందా అని అడిగి తెలుసుకున్నారు.

కరొనా వ్యాప్తి, కంటైన్ మెంట్ జోన్ల పరిమితులు, నిబంధనల పైన పూర్తిగా అవగాహన ఉన్నవారు తమ పక్క న ఉన్న వారికి మరింత అవగాహన కల్పించి ఇంటికే పరిమితం అయ్యేలా చూడాలని అక్క‌డి స్థానిక ప్ర‌జ‌ల్ని కోరారు మంత్రి కేటీఆర్‌. కరోనా లక్షణాలు గనుక కనిపిస్తే స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ, గ‌డ‌ప‌దాట‌కుండా ఉన్నంత వ‌ర‌కు సురక్షితంగా ఉండగలుగుతామ‌న్నారు. లేదంటే కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చ‌రించారు. . కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి సారించి, గమనిస్తూ ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. 
ఎలాంటి వైద్య సహకారం కావాల‌న్నా ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని సూచించారు. కంటైన్ మెంట్ జోన్లలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ అత్యవసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని భ‌రోసా క‌ల్పించారు. కంటెన్న్మెంట్ జోన్లలో పనిచేస్తున్న పారిశుద్ధ్య,  వైద్య సిబ్బంది తోనూ మంత్రి కేటీఆర్ మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని ఈ మేరకు కంటైన్ మెంట్ జోన్ లో ఉన్న స్థానికులకు కాస్తంత భరోసా ఇచ్చేందుకు తాను స్వయంగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. త్వరలోనే కరోనా వైరస్ కట్టడి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. లాక్ డౌన్ నిబంధనలు ఎత్తేసే వరకు అందరూ వాటిని పాటించాలని విజ్ఞప్తి చేశారు.