KTR Road Show : “గల్లీ పార్టీ కావాలా ..? ఢిల్లీ పార్టీ కావాలా”, విపక్షాలపై కేటీఆర్ మార్క్ పంచ్లు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. అధికార టీఆర్ఎస్ తమ మార్క్ ప్రణాళికలతో ప్రచారం సాగిస్తోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. అధికార టీఆర్ఎస్ తమ మార్క్ ప్రణాళికలతో ప్రచారం సాగిస్తోంది. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత నగరంలో విసృత పర్యటనలు చేస్తున్నారు. పలు సమ్మేళనాలు, రోడ్ షోలు, బహిరంగ సభలలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న మంత్రి ప్రతిరోజు ఐదు నుంచి ఆరు రోడ్ షోలలో పాల్గొంటూ..కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు నగరంలోని ఎల్బీ స్టేడియం రెడీ అవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28 ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సభా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అనంతరం మంత్రి .. మల్కాజ్గిరి, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ చేసిన అభివృద్ది కార్యక్రమాలను వివరించడంతో పాటు..బీజేపీ, కాంగ్రెస్పై తన మార్క్ పంచ్లతో ఆకట్టుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులను గ్రేటర్ ఎన్నికల్లో గెలిపించి..ప్రశాంతంగా ఉన్న హైదారాబాద్ వాతావరణాన్ని కొనసాగించాలని కోరారు.
LIVE NEWS & UPDATES
-
కేంద్రానికి 2 లక్షల 72 వేల కోట్లు పన్నులు కడితే, వాళ్లు తెలంగాణకు ఇచ్చింది లక్షా 40 వేల కోట్లు
బీజేపీ పెద్దలు అన్ని అభివృద్ది పనుల్లో తమకు కూడా భాగస్వామ్యం ఉందని చెబుతున్నారని, పోయిన 6 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా నాలుగు కోట్ల మంది 2 లక్షల 72 వేల కోట్ల రూపాయలు పన్నులు రూపంలో కట్టామని, కేంద్ర నుంచి తెలంగాణకు కేవలం లక్షా 40 వేల కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పారు. ఇక్కడికి రావాల్సిన నిధులను బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్కు తరలిస్తున్నారని పేర్కొన్నారు. 2014 లో ప్రధాని మోదీ ప్రతి వ్యక్తి జన్ ధన్ ఖాతాలో లక్షల్లో డబ్బులు వేస్తానని చెప్పారని, ఎంతమందికి ఆ డబ్బులు వేశారో తెలపాలని ప్రశ్నించారు.
-
పచ్చగా ఉన్న హైదారాబాద్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు
హిందువులు, ముస్లింల మధ్య అగ్గిరాజేసి..ఆ మంటల్లో చలి కాచుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. యువతకు ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు కావాలని వివరించారు. హైదరాబాద్లో ఐటీ, ఐఆర్ మంజూరైతే దాని వల్ల లక్షల కొలువులు వచ్చే అవకాశాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వమే అని కేటీఆర్ తెలిపారు. ప్రశాంతంగా ఉంటేనే, మన దగ్గర పెట్టుబడులు పెడతారని, నాలుగు ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ఇంకా మూడేళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని, లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రెడీగా ఉన్నాయని..వాటికి లబ్ధిదారులకు కచ్చితంగా అందజేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గల్లీ పార్టీ కావాలో, లొల్లి లొల్లి చేసే ఢిల్లీ పార్టీ కావాలో ప్రజలు ఆలోచించుకోని ఓటు వేయాలన్నారు.
-
-
సింహం సింగిల్గానే వస్తుంది...
గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారానికి ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు 10 నుంచి 12 మంది వస్తున్నారని.. పక్క రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, మాజీలు వస్తున్నారని, రేపో, ఎల్లుండో మోదీ గారు కూడా వస్తున్నారని..ఇక ట్రంప్ మాత్రమే మిగిలున్నాడని కేటీఆర్ చమత్కరించారు. ఇది హైదారాబాద్ ఎలక్షనా, పార్లమెంట్ ఎలక్షనో అర్థం కావడం లేదన్నారు. పెద్దలు చెప్పినట్లు సింహం సింగిల్ గానే వస్తుందని, కేసీఆర్ సింగిల్ అని సినిమా డైలాగ్ను ఉదహరించారు కేటీఆర్. వరదలు వచ్చినప్పుడు తాము మాత్రమే ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్లామని, అప్పుడు వీరంతా ఎక్కడికి వెళ్లారని కేటీఆర్ ప్రశ్నించారు.
-
వరద కష్టాలు చూసి సీఎం గారు సాయం చేస్తుంటే అడ్డుకున్నారు
ఇటీవల హైదారాబాద్ లో వర్షాల కారణంగా కొన్ని కాలనీలలోకి వరద నీరు ప్రవేశించిందని, ఆ సమయంలో ప్రజల కష్టాల చూసి..ఆరు లక్షల అరవై నాలుగు వేల కుటుంబాలకు రూ. 10 చొప్పున సాయం చేసే ప్రయత్నం చేశామని వివరించారు. ఆ సాయం కొందరికి నచ్చలేదని, కేసీఆర్ కు మంచి పేరు వస్తదని ఉత్తరాలు రాసి ఆపేశారని ఆరోపించారు. ఇవాళ వాళ్లు రూ. 25 వేలు ఇస్తానంటున్నారని..అమ్మకు అన్నం పెట్టనివాడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అని కేటీఆర్ ప్రశ్నించారు. డిసెంబర్ 4 తర్వాత ఎవరైనా సాయం అందనివాళ్లు ఉంటే వారికి కూడా అంజేస్తామన్నారు.
-
రాష్ట్రం ప్రశాంతంగా ఉండబట్టే పెట్టుబడులు
తెలంగాణ వస్తే హైదారాబాద్కు పెట్టుబడులు రావు, కరెంటు ఉండదు, రోజూ తెలంగాణ, ఆంధ్రా అని తన్నుకుంటారని గతంలో కొందరు అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ ఆరేళ్లలో ఎక్కడైనా గొడలయ్యాయా..? కరెంట్ 24 గంటలు రాలేదా..? మంచినీళ్లు అందించలేదా..? ఆలోచన చెయ్యాలని కేటీఆర్ ప్రజలకు సూచించారు. రెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ఆరేళ్లలో తెచ్చుకున్నామని, అమెజాన్, ఫేస్ బుక్, యాపిల్, గూగుల్ కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉంది కాబట్టే అని వివరించారు. అంతేకాదు ఇక్కడి ఉన్నవాళ్లకు టాలెంట్ ఉందని, అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు.
-
-
హైదారాబాద్ను ఒక పచ్చటి పొదరిల్లు మార్చాం
పిల్లలు పెద్దయి సర్కార్ బడికి పోతే సన్న బియ్యంతో బువ్వ పెడుతున్నామని, ఇంకొద్దిగా పెద్దగయితే లక్షా ఇరవై వేలు ఒక్కో విద్యార్థిపైనా ఖర్చు పెడుతున్నామని చెప్పారు. అదే పిల్లలు విదేశాలకు పోయి చదువుకుంటామంటే స్కాలర్షిప్లు ఇస్తున్నామన్నారు. గల్లీగల్లీలో ఎల్.ఈ.డీ లైట్లు, గల్లీగల్లీలో సీసీ కెమెరాలు పెట్టుకున్నామని చెప్పారు. హైదారాబాద్ను ప్రశాంతంగా ఒక పచ్చటి పొదరిల్లుగా మార్చుకున్నామని వివరించారు.
-
ఇక నుంచి నల్లా బిల్లు లేదు
ఇక నుంచి నల్లా బిల్లు కట్టే అవసరం లేదని ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. శాశ్వతంగా నల్లా బిల్లు లేకుండా చేశామని వివరించారు. ఒక్కో మనిషికి ఆరు కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నామని, ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద 1,00,116 ఇస్తున్నామని చెప్పారు. అదే ఆడబిడ్డ కడుపులో బిడ్డ పడితే కేసీఆర్ కిట్టు కింద మగబిడ్డ అయితే 12 వేలు, ఆడబిడ్డ అయితే 13 వేలు సహాయం చేస్తున్నామని వివరించారు.
-
గతంలో కరెంట్ ఉంటే వార్త, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ పోతే వార్త
ఈ ఐదేళ్లలో ఏం చేసినమో చెప్పి ఓటు అడగాల్సిన బాధ్యత మాపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో కరెంట్ ఉంటే వార్త, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ పోతే వార్త అని వివరించారు. రైతాంగానికి కానీ, సాధారణ ప్రజలకు గానీ 24 గంటలు కరెంట్ అందిస్తున్నామన్నారు. మల్కాజ్గిరి నియోజకర్గంలో రూ. 350 కోట్లతో కార్యచరణ చేసి ప్రజలకు తాగునీటి ఎద్దటి లేకుండా చేశామని చెప్పారు. గతంలో 10 రోజులకొకసారి, 7 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి. ప్రస్తుతం రోజు తప్పించి రోజు నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. మున్ముందు ప్రతి రోజూ నీళ్లిచ్చి తీరుతామని స్పష్టం చేశారు.
Published On - Nov 26,2020 9:23 PM