వరద సహాయ చర్యలపై కేటీఆర్ కీలక ఆదేశం

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కే.తారక రామారావు జీహెచ్ఎంసీ, వాటర్‌వర్క్స్, విద్యుత్ శాఖాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇబ్బందుల పాలైన నగర ప్రజలను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను పురమాయించారు.

వరద సహాయ చర్యలపై కేటీఆర్ కీలక ఆదేశం
Follow us

|

Updated on: Oct 28, 2020 | 7:04 PM

KTR important orders on flood relief works:  భారీ వర్షాల అనంతరం ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలను మరింత వేగవంతంగా కొనసాగించాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఇప్పటి దాకా వరదల సమయంలో చేపట్టిన సహాయ కార్యక్రమాలతో పాటు వరదల  అనంతరం నగరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ బుధవారం మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వం వరద బాధితుల కోసం అందిస్తున్న పదివేల రూపాయల తక్షణ సహాయానికి సంబంధించిన కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నదని అధికారులు మంత్రికి వివరించారు. గురువారం సాయంత్రానికి వరద ప్రభావిత కుటుంబాలన్నింటికీ ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందని జీహెచ్ఎంసీ అధికారులు మంత్రికి తెలియజేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీకి చెందిన పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన సిబ్బంది నగరంలో పెద్ద ఎత్తున స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టారని తెలిపారు. ఈ సానిటేషన్ డ్రైవ్ మంత్రి ఆదేశాల ప్రకారం చేపట్టామని, ప్రస్తుతం వరద ప్రభావిత కాలనీలలో పెద్ద ఎత్తున డిస్‌ఇన్పెక్టెంట్ చల్లడంతో పాటు బురద తొలగింపు, చెత్త తరలింపు వంటి కార్యక్రమాలను అదనపు సిబ్బంది సహాయంతో కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ లో మూడున్నర వేల మెట్రిక్ టన్నుల అదనపు చెత్తను సేకరించి తరలించామన్నారు.

ఇంకా ఎక్కడైనా చెత్త ఉంటే జీహెచ్ఎంసీకి ఫోన్ చేసి చెబితే దానిని తరలించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి ఫోన్ నెంబర్లను జీహెచ్ఎంసీ విడుదల చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. జీహెచ్ఎంసీ చేపడుతున్న సహాయక, రిస్టోరేషన్ కార్యక్రమాల్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లతోపాటు పలు ఎన్జీవోలను భాగస్వాములను చేసుకునే ప్రయత్నం చేస్తే మరింత బాగుంటుందని మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. వరదల వలన చెడిపోయిన రోడ్లకు మరమ్మతులు చేసే కార్యక్రమాలను వేగంగా చేపట్టాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. ఈ మేరకు సర్కిల్‌వైజ్‌గా రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని ప్రధాన మార్గాలపై మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించాలని, తద్వారా ప్రజలకి ఉపయుక్తంగా ఉంటుందని సూచించారు. గతంలో ఉన్న ఫ్లైఓవర్‌లకు సంబంధించి.. వాటి పైన ఉన్న వర్షపు నీరు కిందికి పోయేందుకు ఏలాంటి సౌకర్యం లేదని, వర్షపు నీరు సాఫీగా కిందకి వెళ్లేలా రెట్రో ఫిట్టింగులను అన్ని ఫ్లైఓవర్‌లపై ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

ఇప్పటికి చెరువులకు సంబంధించిన మరమ్మతు లేదా చెరువు కట్టల బలోపేతానికి సంబంధించిన కార్యక్రమాలపై సాగునీటి శాఖ సిబ్బంది ద్వారా కొన్ని సూచనలు వచ్చాయని, ఆ మేరకు వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. చెరువులతో పాటు నాలాలోనూ వరదల వలన పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయిందని, వీటిని తొలగించే కార్యక్రమాలు సైతం చేపట్టాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు ఆదేశించారు. నగర శివార్లలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ వరద అనంతరం చేపడుతున్న సహాయక పునరావాస చర్యలపైన కేటీఆర్ ఈ సందర్భంగా సీడీఎమ్ ఏ.సత్యనారాయణను వివరాలు అడిగి తెలుసుకున్నారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ఈ కార్యక్రమాలను వేగంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Also read: రైతు భరోసా కేంద్రాలపై గురుతర బాధ్యత.. జగన్ సంచలన నిర్ణయం

Also read: ఇళ్ళను ఆక్రమించుకుంటాం… టీడీపీ నేతల హెచ్చరిక

Also read: కొత్త సచివాలయ నిర్మాణానికి ‘సుప్రీం‘ ఓకే

Also read: పోతుల సునీత షాకింగ్ డెసిషన్

Also read: సొంత సీఎం కేండిడేట్‌పై మోదీ సెటైర్లు

Also read: ఏపీ పోలీస్ దేశంలోనే నెంబర్ 1.. ఎందులోనంటే..?