తెలుగు రాష్ట్రాల జల వివాదం…నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ
పరిమితికి మించి నీటిని వాడేసుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంటే... మాకు కేటాయించిన నీటినే మేం వాడుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం అంటోంది.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ బేసిన్లో మిగులు జలాల వివాదం మరోమారు అగ్గిరాజుకుంటోంది. ఏపీ ప్రభుత్వం… పరిమితికి మించి నీటిని వాడేసుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంటే… మాకు కేటాయించిన నీటినే మేం వాడుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఈ పరిస్థితుల్లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సాంకేతిక కమిటీ నేడు (బుధవారం)సమావేశం నిర్వహించనుంది. కృష్ణా మిగులు జలాలపై చర్చించేందుకు కేంద్ర జల సంఘం ఐఎండీ సీఈ, కృష్ణా బోర్డు సభ్యుడు హరికేశ్ మీనా, తెలంగాణ, ఆంధప్రదేశ్ అంతరాష్ట్ర వ్యవహారాల చీఫ్ ఇంజినీర్లు సమావేశం కానున్నారు. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం జరగనుంది.
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్ళీ వాటర్వార్ మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి తరలింపు కోసం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలన్న ఎపీ ప్రభుత్వనిర్ణయంపై తెలంగాణ భగ్గుమంటోంది. పోతిరెడ్డి పాడు సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచాలన్న నిర్ణయం, ఈ నీటి తరలింపుకు ఎత్తిపోతల పెట్టాలనుకోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే దీనిపై సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేయగా, మంగళవారం తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్కుమార్ కృష్ణాబోర్డుకు దీనిపై ఫిర్యాదుచేశారు. ఎపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ, లిఫ్ట్ పనులకు సంబంధించిన జీవో 203ను తక్షణమే రద్దుచేయాలని లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదునేపథ్యంలో కృష్ణానదీ యాజమాన్యబోర్డు రంగంలోకి దిగింది.