డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్స్ ఇవ్వండి: కృష్ణా బోర్డు
హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలని రెండు రాష్ట్రాల ప్రతినిధులకు బోర్డు సూచన.
కృష్ణా నదిపై రెండు తెలుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న పోటా పోటీ ప్రాజెక్టులపై పరస్పర ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశమైంది. ఆరు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. అనంతరం సమావేశం వివరాలను బోర్డు చైర్మన్ పరమేశం మీడియాకు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలని రెండు రాష్ట్రాల ప్రతినిధులకు సూచించినట్లు పరమేశం తెలిపారు. ఇక నదిపై నిర్మస్తున్న కొత్త ప్రాజెక్టులకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు (డీపీఆర్లు) ఇవ్వాలని పరమేశం సూచించారు. రెండో దశ టెలిమెట్రీని ప్రాధాన్యతా అంశంగా పరిగణించి అమలు చేసేందుకు రెండు ప్రభుత్వాలు సమ్మతంగా ఉన్నాయన్నారు. ఇక శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం నుంచి 50:50 నిష్పత్తిలో విద్యుత్ పంపకానికి రెండు రాష్ట్రాల ప్రతినిధులు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. తాగునీటి వినియోగాన్ని 20 శాతమే లెక్కించాలనే దానిపై ఇరు రాష్ట్రాలు అంగీకరించనట్లు బోర్డు చైర్మన్ పరమేశం తెలిపారు. ఏపీలోని గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కు తరలిస్తున్నందున తెలంగాణకు అదనంగా నీటిని కేటాయించాలని డిమాండ్ నేపధ్యంలో.. ఈ అంశంపై జలశక్తి శాఖకు ఇప్పటికే నివేదించినట్లు బోర్డు ఛైర్మన్ పరమేశం తెలిపారు.