ఆన్లైన్ గేమ్స్ కోసం బ్యాంకుకే కన్నం వేశాడు..
నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో భారీ కుంభకోణం. హెడ్ క్యాషియర్ గుడ్రం రవితేజ చేతివాటం ప్రదర్శించి రూ.1.56కోట్లకు బ్యాంక్కు కుచ్చుటోపీ.
అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడ్డాడు. చేసేదీ బ్యాంక్ ఉద్యోగం. కళ్ల ముందు కోట్ల రూపాయలు కదలాడుతున్నాయి. తనది కానీ సొమ్మునే ఆటలో పణంగా పెట్టాడు. ఏకంగా కోటిన్నర రూపాయల కాజేశాడు ఓ బ్యాంక్ క్యాషియర్. కృష్ణా జిల్లా నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో భారీ కుంభకోణం జరిగింది. బ్యాంక్ క్యాషియర్గా నమ్మకంగా పని చేస్తున్నహెడ్ క్యాషియర్ గుడ్రం రవితేజ చేతివాటాన్ని ప్రదర్శించి ఏకంగా రూ.1.56కోట్లకు బ్యాంక్కు కుచ్చుటోపీ పెట్టాడు. ఆన్లైన్లో రమ్మీ, కాసినో ఆటకు బానిసైన రవితేజ.. డబ్బులు లేకపోవడంతో తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు. ఖాతాదారుల నగదును తన అకౌంట్లోకి బదిలీ చేసుకున్నాడు. అనుమానం వచ్చిన బ్యాంక్ చీఫ్ మేనేజర్ తనిఖీ చేయడంత బాగోతం బయటపడింది. దీంతో నూజివీడు టౌన్ పోలీసులకు మేనేజర్ ఫిర్యాదు చేశాడు. హెడ్ క్యాషియర్ రవితేజపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.