ఆ స్వీట్ ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందట..!
కోల్కతాకు చెందిన ఓ వ్యాపారి తన స్వీట్ తింటే కరోనా రాకుండా నివారించవచ్చంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. ఇందులో ఇమ్యూనిటీ పవర్ ఉందంటూ క్యాష్ చేసుకుంటున్నాడు.
కరోనా వైరస్ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ పేరుతో చెబితేనే వైద్యులు, శాస్త్రవేత్తలు హడలిపోతున్నారు. ఇప్పటికీ వ్యాక్సిన్స్ దొరక్క కొవిడ్ కట్టడి చేయలేక తలలు పట్టుకున్నారు. అయితే, కోల్కతాకు చెందిన ఓ వ్యాపారి తన స్వీట్ తింటే కరోనా రాకుండా నివారించవచ్చంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. ఇందులో ఇమ్యూనిటీ ఉందంటూ క్యాష్ చేసుకుంటున్నాడు. కొవిడ్-19 వైరస్ బయటపడి నెలలు గడుస్తున్నా కచ్చితమైన చికిత్సా విధానం అందుబాటులోకి రాలేదు. దీన్ని నివారించాలంటే వ్యక్తిగత శుభ్రత, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో జనంతా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటున్నారు. తాజాగా తానూ తయారు చేసిన సందేశ్ కూడా జత చేయండంటున్నాడు కోల్కతా మిఠాయివాలా. కోల్కతాలోని బలరామ్ ముల్లిక్, రాధారమన్ ముల్లిక్ అనే మిఠాయిల దుకాణందారులు ‘ఇమ్యూనిటీ సందేశ్’ స్వీట్ ను తయారు చేశారు. రోగనిరోధక శక్తిని పెంచే వివిధ మూలికలతో వీటిని తయారు చేశామని చెప్పుకొచ్చారు. పసుపు, లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు, కాలా జీరా, ములేథి, బిర్యానీ ఆకు, తేనె తదితర రకాల మూలికలతో ఈ స్వీట్స్ను తయారు చేసినట్లు దుకాణం నిర్వాహకులు తెలిపారు. కరోనా వైరస్కు వ్యాక్సిన్ ఇంకా రాలేదు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే సరైన మార్గం. అందుకే ఆయుర్వేద నిపుణులను సంప్రదించి 15 రకాల మూలికలతో వీటిని తయారు చేశామని.. చక్కెర జత చేయకుండా కేవలం హిమాలయా తేనెతో మాత్రమే తయారు చేశామని మిఠాయివాలా చెప్పారు. ఒక్కో మిఠాయి ఖరీదు రూ.25 గా నిర్ణయించినట్లు దుకాణం యజమానులు తెలిపారు. ఈ మిఠాయిలకు స్థానికంగా మంచి డిమాండ్ ఉందని.. ప్రజలు వీటిని ఎంతో ఇష్టంగా అస్వాదిస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే వీటిని మాత్రం వైద్యులు అధికారికంగా ధృవీకరించాల్సివుంది.