పెద్దల సభకు ఉమ్మడి అభ్యర్థిగా ప్రొఫెసర్
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి... ప్రస్తుతం తెలంగాణ జన సమితి పార్టీతో రాజకీయాల్లో కొనసాగుతున్న ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి త్వరలో...
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి… ప్రస్తుతం తెలంగాణ జన సమితి పార్టీతో రాజకీయాల్లో కొనసాగుతున్న ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి త్వరలో జరిగే శాసన మండలి ఎన్నికల బరిలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలవబోతున్నారా? పరిస్థితులు, పరిణామాలు చూస్తే నిజమేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలంగాణ జన సమితి పార్టీ సన్నాహాలను పరిశీలిస్తే కోదండరామ్ నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలికి పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి టీజెఎస్ పార్టీలో నిర్ణయం జరిగిందని, ఇతర విపక్షాల మద్దతు కూడగట్టేందుకు టీజెఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది.
త్వరలో జరగనున్న పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ రెడ్డి పోటీచేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా మద్దతునివ్వాలని తెలంగాణ జన సమితి ప్రతిపక్ష పార్టీలను కోరుతోంది. ఈ మేరకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలకు టీజేఎస్ తాజాగా లేఖలు రాసినట్లు సమాచారం. కోదండరామ్ రెడ్డి అభ్యర్థిత్వానికి నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని, ప్రస్తుత పరిస్థితులపై శాసనమండలిలో గొంతెత్తే నాయకుడైన కోదండరామ్ రెడ్డికి మద్దతునివ్వాలని టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇన్ఛార్జీ జి. వెంకట్రెడ్డి అయిదు విపక్ష పార్టీల అధినేతలకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో టీజేఎస్ పార్టీ విపక్ష కూటమిలో కాంగ్రెస్, టీడీపీలతో కలిసి ఎన్నికల బరిలో నిలిచి ఒక్క సీటులో కూడా గెలవలేకపోయింది. అయితే.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ప్రొ. కోదండరామ్ రెడ్డి అభ్యర్థిత్వానికి టీడీపీ మద్దతునిచ్చే పరిస్థితి కనిపిస్తుండగా.. కాంగ్రెస్, వామపక్షాల మద్దతు కూడగట్టడం మాత్రం అంత ఈజీ కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.