‘థియేటర్ల ఓపెనింగ్’పై కేంద్ర నిర్ణయం?..కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దేశంలో లాక్డౌన్ విధించిన నాటినుంచి దాదాపు నాలుగు నెలలుపై బడి సినిమా హాళ్లకు తాళాలు తీయని దుస్థితి నెలకొంది. దీంతో సినీ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో అన్లాక్-3లో భాగంగా సినిమాహాళ్లు తెరుచుకునే అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక విషయం వెల్లడించారు.
కరోనా, లాక్డౌన్ కారణంగా చాలా రకాల వ్యవస్థలు ఇప్పటికీ మూతపడే ఉన్నాయి. దేశంలో లాక్డౌన్ విధించిన నాటినుంచి దాదాపు నాలుగు నెలలుపై బడి సినిమా హాళ్లకు తాళాలు తీయని దుస్థితి నెలకొంది. షూటింగ్లన్నీ నిలిచిపోయాయి. దీంతో సినీ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో అన్లాక్-3లో భాగంగా సినిమాహాళ్లు తెరుచుకునే అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక విషయం వెల్లడించారు.
మంగళవారం దక్షిణాది సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాతలతో మంత్రి కిషన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దగ్గుబాటి సురేష్ బాబు, అరవింద్, చిట్టిబాబు త్రిపురణ్, వెంకటేష్ రెడ్డి, షాజి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. లాక్డౌన్, కంటైన్మెంట్ జోన్ల విధింపు నిర్ణయంపై రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని, అయితే సినిమా థియేటర్లు, మ్యారేజ్ హాల్స్, పొలిటికల్ పార్టీ మీటింగ్లు, ఆధ్యాత్మీక కార్యకలాపాలపై కేంద్రం నిబంధనలు విధించిందన్నారు.
సినిమా థియేటర్ల ప్రారంభంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. ఈనెల 30, 31 వరకు ఈ అంశంపై స్పష్టత వస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. కరోనా సమయంలో సినీరంగం తీవ్రంగా నష్టపోయిందని, ప్రతి ఏటా ఈ రంగం నుంచి కేంద్రానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరేదని ఆయన తెలిపారు. ఐటీ, పలు ఉత్పత్తి కేంద్రాలు, తయారీరంగానికి చెందిన పరిశ్రమలు, కెమికల్ యూనిట్స్, ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమపై ఇంకా కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.