రైల్లో వియత్నాంకు ప్రయాణిస్తున్న కిమ్
బీజింగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో చర్చల కోసం వియత్నాం బయల్దేరారు. కాకపోతే ఈ యాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. ఆయన గతంలో మాదిరిగా విమానంలో కాకుండా ఈ సారి రైల్లో వియత్నాంకు ప్రయాణిస్తున్నారు. ఈ రైలును ఆయన తండ్రి, తాతలు కూడా తమ ప్రయాణాలకు వినియోగించేవారు. శనివారం ఆయన ప్యాంగ్యాంగ్ను వీడి బయల్దేరే ముందు సైనిక వందనం స్వీకరించారు. ఈ ప్రయాణంలో కిమ్తో పాటు కీలక జనరల్ కిమ్ యంగ్ చోల్ […]
బీజింగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో చర్చల కోసం వియత్నాం బయల్దేరారు. కాకపోతే ఈ యాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. ఆయన గతంలో మాదిరిగా విమానంలో కాకుండా ఈ సారి రైల్లో వియత్నాంకు ప్రయాణిస్తున్నారు. ఈ రైలును ఆయన తండ్రి, తాతలు కూడా తమ ప్రయాణాలకు వినియోగించేవారు. శనివారం ఆయన ప్యాంగ్యాంగ్ను వీడి బయల్దేరే ముందు సైనిక వందనం స్వీకరించారు. ఈ ప్రయాణంలో కిమ్తో పాటు కీలక జనరల్ కిమ్ యంగ్ చోల్ కూడా ఉన్నారు.
ప్యాంగ్యాంగ్ నుంచి వియత్నాంకు దాదాపు 4000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనికోసం కిమ్ 60 గంటల ప్రయాణించాల్సి ఉంటుంది. ఆయన ప్యాంగ్యాంగ్ రైల్వేస్టేషన్లో అభివాదం చేస్తున్న చిత్రాలను ఉత్తరకొరియా అధికారిక వార్తాసంస్థ కేసీఎన్ఏ విడుదల చేసింది. శనివారం రాత్రికి చైనా ఉత్తరకొరియా మధ్య ఉన్న డాన్డంగ్ పట్టణాన్ని ఈ రైలు దాటేసింది. డాన్డంగ్లో ఈసందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న చైనా-ఉత్తరకొరియా ఫ్రెండ్షిప్ వంతెనను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ వంతెనకు అభిముఖంగా ఉన్న హోటల్ను మూసివేయించారు. కాకపోతే ఈ రైలు ప్రయాణించే రూట్మ్యాప్ను మాత్రం ఇప్పటి వరకు కచ్చితంగా వెల్లడించలేదు.
కిమ్ రైలు చైనా రాజధాని బీజింగ్కు మాత్రం వెళ్లే అవకాశం లేదు. బీజింగ్ రైల్వే స్టేషన్ వద్ద ఎటువంటి అదనపు భద్రతా ఏర్పాట్లను చేయలేదు. కిమ్ చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ను గతంలోనే నాలుగుసార్లు కలుసుకొన్నారు. చివరి సారిగా గత జనవరిలో భేటీ అయ్యారు. ట్రంప్తో భేటీ అనంతరం తిరుగు ప్రయాణంలో షీజిన్పింగ్ను కలుసుకొనే అవకాశం ఉంది.
చర్చల కంటే ముందే కిమ్ బృందం హనోయ్ చేరుకొంటుంది. కిమ్ ప్రయాణిస్తారని భావిస్తున్న 170 కిమీ మార్గాన్ని మంగళవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేస్తున్నట్లు వియత్నాం ప్రభుత్వం ప్రకటించింది.
కిమ్ వంశంలో రైలు ప్రయాణాలు కొత్తేమీ కాదు. ఆయన తాత కిమ్ ఇల్ సుంగ్ 1984లో తూర్పు యూరప్ యాత్రను రైల్లోనే పూర్తిచేశారు. ఆయన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ కూడా 2001లో మాస్కోకు రైల్లో ప్రయాణించారు. భద్రత కారణాల దృష్ట్యా చైనాకు చెందిన విమానంలో వియత్నాం వెళ్లడం మంచింది. కానీ ఉత్తరకొరియా స్వతంత్రంగా వ్యవహరించగలదు అని సంకేతాలను పంపేందుకే కిమ్ రైల్లో వియత్నాంకు పయనమయ్యారు.