కేశినేని రూటే సెపరేటు..గైర్హాజరులో మతలబేంటి?
కేశినేని నాని.. మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో కేశినేని ఒకరు. అయితే, గెలిచినప్పట్నించి ఆయన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ట్వీట్లతో సొంత పార్టీ అధినేతను ఇరుకున పడేసిన కేశినేని నాని.. గత రెండు నెలలుగా కాస్త సైలెంట్గానే వున్నారు. ఒకట్రెండు సందర్భాలలో పార్టీ వైఖరికి అనుగుణంగా ఢిల్లీలో టిడిపి ఎంపీలతో కలిసే తిరిగారు. కానీ తాజాగా ఆయన చేసిన ఓ చర్య ఆశ్చర్యానికి గురిచేస్తోంది. […]
కేశినేని నాని.. మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో కేశినేని ఒకరు. అయితే, గెలిచినప్పట్నించి ఆయన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ట్వీట్లతో సొంత పార్టీ అధినేతను ఇరుకున పడేసిన కేశినేని నాని.. గత రెండు నెలలుగా కాస్త సైలెంట్గానే వున్నారు. ఒకట్రెండు సందర్భాలలో పార్టీ వైఖరికి అనుగుణంగా ఢిల్లీలో టిడిపి ఎంపీలతో కలిసే తిరిగారు. కానీ తాజాగా ఆయన చేసిన ఓ చర్య ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో దాదాపు ప్రతీ రోజు ఉదయాన్నే తన ట్వీట్లతో తెలుగు మీడియాను నిద్రలేపే వారు కేశినేని. తన ట్వీట్లు సృష్టిస్తున్న బ్రేకింగ్ న్యూస్ని ఆస్వాదిస్తూ.. అప్పుడప్పుడు ఫోన్ లైన్లోను న్యూస్ పండించే వారాయన. ఆయన ట్వీట్లతో కొన్ని సార్లు టిడిపి అధినేత చంద్రబాబు తలనొప్పులు కలిగించారు.
ఆ తర్వాత కారణాలేంటోగానీ కేశినేని సైలెంటయ్యారు. పార్టీ లైన్కు కట్టుబడి వున్నట్లు కనిపించారు. సహచర ఎంపీలతో కలిసి ఢిల్లీ కార్యకలాపాలలో పాల్గొన్నారు. కానీ సోమవారం లోక్సభలో కనిపించకుండా.. టిడిపి పార్టీ లైన్కు భిన్నంగా వ్యవహరించడంతో ఆయన మరోసారి వార్తలకెక్కారు. సోమవారం లోక్సభలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ చర్చ తర్వాత అర్ధరాత్రి బిల్లుపై ఓటింగ్ జరిగింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వైసీపీ, టిడిపి పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. అందులో భాగంగా లోక్సభలో వున్న ముగ్గురు ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాల్సి వుండింది. కానీ కేశినేని నాని ఓటింగ్ సమయానికి గాయబయ్యారు.
కేశినేని ఓటింగ్కు గైర్హాజరైన విషయాన్ని తోటి ఎంపీలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళినట్లు సమాచారం. గైర్హాజరవడం ద్వారా తాను పార్టీ లైన్ను ధిక్కరించినట్లు చంద్రబాబుకు ఇన్డైరెక్టుగా మెసేజ్ పంపారా? లేక ఏదైనా అత్యవసర పనితో సభకు డుమ్మా కొట్టారా? అన్నదిప్పుడు టిడిపి శ్రేణుల్లో జరుగుతున్న చర్చ. బిజెపికి దగ్గరయ్యేందుకు అందివచ్చిన అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్న చంద్రబాబుకు కేశినేని వైఖరి కొత్త తలనొప్పులు తెస్తుందని పార్టీ వర్గాలంటున్నాయి.
టిడిపిని వీడేందుకు సిద్దమైన కేశినేని ఉద్దేశ పూర్వకంగానే ఓటింగ్ సమయంలో ఆబ్సెంటయ్యారని అంటున్నారు. అయితే కేశినేని దారెటు? ఏ పార్టీలో చేరబోతున్నారు? లేక తాజా గైర్హాజరు టీ కప్పులో తుఫానేనా? ఈ చర్చ తెలుగుదేశం పార్టీలో జోరందుకుంది.