ఆ తీర్మానాన్ని వ్యతిరేకించా, మాట మార్చిన కేరళ బీజేపీ ఎమ్మెల్యే రాజగోపాల్, అసెంబ్లీలో రూల్స్ ఉల్లంఘించారని విమర్శ
రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ కేరళ సీఎం పినరయి విజయన్ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి తను కూడా మద్దతునిచ్చినట్టు ప్రకటించి...
రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ కేరళ సీఎం పినరయి విజయన్ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి తను కూడా మద్దతునిచ్చినట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచిన బీజేపీ ఎమ్మెల్యే రాజగోపాల్.. కొద్దిసేపటికే మాట మార్చారు. యూ-టర్న్ తీసుకున్నారు. ఓ స్టేట్ మెంట్ ను విడుదల చేస్తూ..ఈ తీర్మానాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని, ఈ విషయమై సభలో తన వైఖరిని స్పష్టంగా తెలిపానని పేర్కొన్నారు. ప్రధాని ఎప్పుడూ రైతులతో చర్చలకు సిధ్ధంగా ఉన్నారని, కానీ ‘ నిరసనకారులు’.. చట్టాలను రద్దు చేయాలని పట్టుబడుతుండడంతో సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు. అసెంబ్లీలో తీర్మాన ఆమోద సమయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆయన ఆరోపించారు. ఓటింగ్ సమయంలో స్పీకర్..ఎవరు ఈ తీర్మానాన్ని సమర్థిస్తున్నారో, ఎవరు వ్యతిరేకిస్తున్నారో సెపరేట్ గా అడగలేదని, కేవలం ఒక ప్రశ్న మాత్రమే అడిగారని రాజగోపాల్ చెప్పారు. ఇది నియమాలను అతిక్రమించడమే అన్నారు.
2016 లో ఈయన 86 ఏళ్ళ వయసులో తొలిసారి ఎన్నికలో గెలిచారు. దీంతో కేరళలో బీజేపీ తొలి ‘రంగ ప్రవేశం’ చేసింది. ఏమైనా ఈయన యూ టర్న్ తీసుకోవడంలో బీజేపీ హైకమాండ్ హస్తం ఉండవచ్ఛునని భావిస్తున్నారు.