రివ్యూ: ‘పెంగ్విన్’.. థ్రిల్ చేస్తుంది.. కానీ..!
కీర్తి సురేష్ 'పెంగ్విన్' ఓటీటీలో విడుదలైంది. ఆమె థ్రిల్లర్ సినిమాలో నటించడం ఇదే తొలిసారి. ఇందులో ఓ బిడ్డకు తల్లిగా నటిస్తోంది. 'మహానటి' సినిమా తర్వాత వస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
టైటిల్ : ‘పెంగ్విన్’
తారాగణం : కీర్తి సురేష్, ఆదిదేవ్, లింగ, మాస్టర్ అద్వైత్, నిత్య, హరిణి తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణ్
నిర్మాత : కార్తీక్ సుబ్బరాజ్
కథ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఈశ్వర్ కార్తీక్
విడుదల తేదీ: 19-06-2020(అమెజాన్ ప్రైమ్ వీడియోలో)
కరోనా వైరస్ చిత్రసీమపై భారీగా ప్రభావం చూపుతోంది. దేశంలో లాక్డౌన్ కొనసాగుతోన్న నేపధ్యంలో థియేటర్లు అన్నీ కూడా మూతపడ్డాయి. ఈ తరుణంలో చిన్న నిర్మాతల చూపు ఓటీటీ వైపు మళ్లింది. అందులో భాగంగానే ఇప్పటికే ‘అమృతారామమ్’, ‘గులాబో సితాబో’ లాంటి చిన్న చిత్రాలు ఓటీటీలలో ప్రేక్షకలను అలరించాయి. ఇప్పుడు కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ కూడా అదే బాట పట్టింది. కీర్తి సురేష్ థ్రిల్లర్ సినిమాలో నటించడం ఇదే తొలిసారి. ఇందులో ఆమె ఓ బిడ్డకు తల్లిగా నటిస్తోంది. ‘మహానటి’ సినిమా తర్వాత వస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి వాటిని ఈ మూవీ అందుకోగలిగిందో.. లేదో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
రిథమ్(కీర్తి సురేష్), రఘు(లింగ)ల ఒక్కగానొక్క కొడుకు అజయ్(మాస్టర్ అద్వైత్) కిడ్నాప్కు గురవుతాడు. పోలీసులతో పాటుగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా పిల్లాడి కోసం అన్ని చోట్లా వెతుకుతారు. కానీ ఎక్కడా కనిపించడు. అజయ్ దుస్తులు ఒక్కొక్కటిగా అడవిలో దొరకడంతో అతడు చనిపోయాడని అందరూ భావిస్తారు. కానీ రిథమ్ మాత్రం అజయ్ బ్రతికే ఉన్నాడని నమ్ముతుంది. ఇదిలా ఉంటే అజయ్ కిడ్నాప్ కావడానికి రిథమే కారణమని రఘు ఆమె నుంచి విడాకులు తీసుకుంటాడు.
అటు రిథమ్ కూడా గౌతమ్(రంగరాజు) అనే వ్యక్తితో కొత్త జీవితం ప్రారంభిస్తుంది. అప్పుడు కూడా ఆమె అజయ్ ఆలోచనల నుంచి బయటికి రాలేకపోవడంతో మళ్లీ వెతకడం మొదలుపెడుతుంది. అసలు అజయ్ ఏమయ్యాడు.? బ్రతికే ఉన్నాడా.? ఎవరు కిడ్నాప్ చేశారు.? ఎందుకు చేశారు.? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.!(మెగా డాటర్ నిహారికకు కాబోయే వరుడు ఇతడేనా..!)
నటీనటుల అభినయం:
రిథమ్ పాత్రలో కీర్తి సురేష్ పూర్తిగా ఒదిగిపోయింది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటిసారిగా ఆమె మిస్టరీ థ్రిల్లర్ మూవీలో నటించగా.. తల్లిగా, నిండు గర్భిణిగా ఆమె పలికించిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక మిగిలిన నటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. ఇక తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఒక్క నటుడు కూడా ఈ సినిమాలో లేకపోవడం గమనార్హం.
విశ్లేషణ :
‘పెంగ్విన్’ ఒక మిస్టరీ థ్రిల్లర్. దీని కోసం దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ఆరంభం నుంచి చివరి వరకు ఉత్కంఠ రేకెత్తించేలా కథనాన్ని తీర్చిదిద్దాడు. మొదటి భాగం మొత్తం అజయ్ కిడ్నాప్, వెతికే ప్రయత్నాలు, తదితర సన్నివేశాలన్నీ కూడా ఆసక్తి కలిగిస్తాయి. ద్వితీయార్ధంలో కూడా ఇదే సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. అయితే క్లైమాక్స్ చివరిలో వచ్చే ట్విస్ట్ మాత్రం చప్పగా ఉంటుంది. దానితో కథ పూర్తిగా తేలిపోతుంది. సెకండ్ హాఫ్ చివర్లో వచ్చే కొన్ని సన్నివేశాలు కూడా గందరగోళంగా ఉంటాయి. అటు అజయ్ కిడ్నాప్కు గల కారణం కూడా చాలా సిల్లీగా ఉంటుంది. అయితే థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి పెంగ్విన్ ఖచ్చితంగా నచ్చుతుంది. కానీ క్లైమాక్స్ను మర్చిపోతేనే..!
సాంకేతిక విభాగాల పనితీరు:
ఓవరాల్గా సినిమా బాగుంది. సంతోష్ నారాయణ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మూవీని మరో లెవెల్కు తీసుకెళ్ళింది. కెమెరా పనితనం బాగుంది. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా.. కథనం మాత్రం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- కీర్తి సురేష్ నటన
- ఫస్ట్ హాఫ్
మైనస్ పాయింట్స్ :
- సెకండాఫ్లో కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు
- క్లైమాక్స్