ఏపీ దేవాలయాలకు జియో ట్యాగింగ్…

ఏపీలో అంతర్వేది రథం దగ్ధం ఘటన పెను సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు...

ఏపీ దేవాలయాలకు జియో ట్యాగింగ్...
Follow us

|

Updated on: Sep 13, 2020 | 1:43 PM

DGP Gautam Sawang Comments: ఏపీలో అంతర్వేది రథం దగ్ధం ఘటన పెను సంచలనమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై జగన్ సర్కార్‌ సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఇవాళ ఆయన రాష్ట్రంలోని పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు.

ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. గత నేరచరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా పెట్టాలన్నారు. ఆలయ కమిటీ సభ్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలన్నారు. ప్రజలు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రతి దేవాలయం దగ్గర పాయిట్‌ బుక్‌ ఏర్పాటు చేయాలని.. స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని తెలిపారు. అంతేకాకుండా ఆలయ పరిసరాల్లో అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు.

అనుకోని ఘటనలు జరిగితే వాటికి సంబందించిన నిర్వాహకులు బాధ్యత వహించాలని డీజీపీ తెలిపారు. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకునేలా పీస్ కమిటీలు వేయాలన్నారు. ఆలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్ధనా మందిరాల వద్ద భద్రతా చర్యలు పెంచాలని పోలీసులకు డీజీపీ పలు సూచనలు ఇచ్చారు. ఎటువంటి ఘటనలు జరిగినా.. కారకులు ఎంతటి‌వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. అదే విధంగా ‌విధుల్లో అలసత్వం వహిస్తే పోలీసు సిబ్బంది పైనా చర్యలు తీసుకుంటాం’ అని డీజీపీ తేల్చి చెప్పారు.