కాశ్మీర్లో పంచాయతీ ఉపఎన్నికలకు బ్రేక్.. మూడు వారాలు వాయిదా
జమ్మూ కాశ్మీర్.. పంచాయతీ ఉప ఎన్నికల వాయిదా.. భద్రతా కారణాలతో మూడు వారాలపాటు వాయిదా వేసినట్టు చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ శైలేంద్ర కుమార్ తెలిపారు.
జమ్మూకాశ్మీర్లో పంచాయతీ ఉపఎన్నికలకు బ్రేక్ పడింది.భద్రతా కారణాల దృష్ట్యా.. ఈ ఎన్నికలను మూడు వారాలపాటు వాయిదా వేశారు. మొత్తం 12,500 పంచాయతీలకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 5 నుంచి 20 వ తేదీ వరకు వీటిని నిర్వహించదలిచామని, అయితే హోం శాఖ నుంచి అందిన ఆదేశాలతో వాయిదా వేశామని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శైలేంద్ర కుమార్ తెలిపారు. మొదటి, రెండో దశ ఎన్నికలకు అప్పుడే రెండు నోటిఫికేషన్లు జారీ చేసినట్టు ఆయన చెప్పారు. 2018 లో ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరిగినా.. వాటిని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ బహిష్కరించాయి. ముగ్గురు మాజీ సీఎంలతో సహా.. పలువురు రాజకీయ నేతలు గత ఏడాది నుంచి నిర్బంధంలో ఉన్న నేపథ్యంలో ఈ పంచాయతీ ఉపఎన్నికలను ఎలా నిర్వహిస్తారని వివిధ పార్టీల నాయకులు శైలేంద్ర కుమార్ ను ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్టీ సహా మరికొందరికి ప్రభుత్వం గృహ నిర్బంధం విధించిన సంగతి తెలిసిందే. గత ఆగస్టు 5 న జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేసిన అనంతరం ఈ కాశ్మీర్ నేతలకు గృహనిర్బంధం విధించారు. అయితే పంచాయతీ ఉపఎన్నికలను నిర్వహించిన పక్షంలో వీరంతా ఈ ప్రక్రియలో ఎలా పాల్గొనగలుగుతారని ఆయా పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.