తెలంగాణ కాంగ్రెస్లో కాకరేపిన జగ్గారెడ్డి కామెంట్లు.. తప్పుడు సమాచారం ఇస్తున్నదెవరు? వార్నింగ్ ఎవరికి?
జగ్గారెడ్డి కామెంట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపిక పార్టీ నేతల్లో కాక పెంచుతోంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత..
Jaggareddy comments ignited fire in TPCC: జగ్గారెడ్డి కామెంట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపిక పార్టీ నేతల్లో కాక పెంచుతోంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత తన వైఫల్యాన్ని అంగీకరిస్తూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకున్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుని ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నజర్ పెట్టింది. అందుకు అభిప్రాయ సేకరణ జరపాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్కు బాధ్యతలప్పగించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.
డిసెంబర్ రెండో వారంలో మొదలైన ఈ అభిప్రాయ సేకరణ హైదరాబాద్ నగరంలోని గాంధీభవన్ వేదికగా కొనసాగుతుండగా.. తెలంగాణ నేతలు తమ అభిప్రాయాలు చెబుతూనే తమకు అవకాశం ఇవ్వాలని ఠాగూర్ని కోరారు. ఈ విధంగా టీపీసీసీ అధ్యక్ష స్థానాన్ని కోరుతున్న వారి సంఖ్య పది కంటే ఎక్కువగా వుండడంతో ఎవరిని ఏ విధంగా అక్కామడేట్ చేయాలి.. ఎవరికి పీసీసీ అధ్యక్ష పీఠం అప్పగించాలనే విషయం రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీకి కష్టసాధ్యంగా మారింది.
ALSO READ: ఎంఐఎం పార్టీ అనూహ్య నిర్ణయం.. జాతీయ కార్యాచరణలో మరో ముందడుగు
ఈ నేపథ్యంలో శనివారం ఓ సమావేశం మరింత ఆసక్తిని పెంచింది. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్కంపై పరోక్షంగా అనుమానాలకు తెరలేపింది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి తదితరులు సమావేశం కాగా.. భేటీ అనంతరం మీడియా ఎదుట జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో హీట్ పెంచాయి. ‘‘ సోనియా, రాహుల్ గాంధీల వద్దకు సరైన సమాచారం వెళ్ళడం లేదు.. పార్టీని నాశనం చేసే వారికి అవకాశం ఇవ్వరాదు.. అభిప్రాయ సేకరణలో పలు అనుమానాలున్నాయి.. ఠాగూర్తో తాడోపేడో తేల్చుకుంటాం.. పార్టీలు మారే వారికి అవకాశం ఇవ్వరాదు.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది.. అభిప్రాయ సేకరణ ఇంకా పూర్తి కాలేదు.. నిర్ణయంలో ఏమైనా తప్పు జరిగితే మాణిక్కం ఠాగూర్, కేసీ వేణుగోపాల్ బాధ్యత వహించాలి ’’ అంటూ హాట్ కామెంట్లు చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి తదితరులు భేటీ అవడం పార్టీలో ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిలో కోమటిరెడ్డి టీపీసీసీ రేసులో ముందు కనిపిస్తుండగా.. శ్రీధర్ బాబు, జగ్గారెడ్డిలు కూడా పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. అయితే.. ప్రధాన పోటీ మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య వున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి నిర్వహించిన ఈ సమావేశం అనంతరం జగ్గారెడ్డి ఈ కామెంట్లు చేయడం అయితే వ్యూహాత్మకం లేదా తమకు వ్యతిరేకంగా నిర్ణయం జరిగే సంకేతాలు కనిపించడమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: ఎంఐఎం పార్టీ అనూహ్య నిర్ణయం.. జాతీయ కార్యాచరణలో మరో ముందడుగు
ఇదిలా వుండగా.. డిసెంబర్ నెలాఖరు నాటిని టీపీసీసీ అధ్యక్షున్ని ఎంపిక చేసే కృత నిశ్చయంతో ఏఐసీసీ పెద్దలున్నట్లు ఢిల్లీ నుంచి సమాచారం. ఠాగూర్ జరుపుతున్న అభిప్రాయ సేకరణ తర్వాత ఆయనిచ్చే నివేదిక తర్వాత ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాలపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీపీసీసీ అధ్యక్షుని ఎంపిక జరుగుతందని తెలుస్తోంది.