YS Jagan: ఏపీలో విద్య దీవెనకు విధివిధానాలు ఇవే..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న విద్య దీవెన పథకానికి సంబంధించిన విధి విధానాలు ప్రభుత్వం జారీ చేసింది.
Jagananna vidya deevena rules & regulations: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న విద్య దీవెన పథకానికి సంబంధించిన విధి విధానాలు ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్య శాఖా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 14ను విడుదల చేశారు. సీఎం జగన్ సవాల్ గా తీసుకున్న నవ రత్నాలు అమలులో భాగంగా విద్యార్థులకు ప్రయోజనం కలిపించేందుకు జగనన్న విద్య దీవెన పథకాన్ని రూపొందించారు. ఈ పథకంలో భాగంగా అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్సమెంట్ చేస్తారు.
జగనన్న విద్య దీవెన పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు, విధి విధానాలలో ప్రధానమైనది.. ఫీజులపై రాష్ట్ర ఉన్నత విద్య శాఖ పర్యవేక్షణ ఉంటుంది. ఫీజు నియంత్రణ కమిషన్ నోటిఫికేషన్కు కాలేజీలు అంగీకరించి ఉండాలి. క్యాపిటేషన్ ఫీజు తదితర అనధికారిక ఫీజులు ఉదాహరణకు డొనేషన్లు లాంటివి వసూలు చేయరాదు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కాకుండా మరేఇతర ఫీజులు వసూలు చేయరాదు. విద్యాసంస్థ నిర్వహణలో మిగులు లాభాన్ని తన సొంతానికి కాకుండా తిరిగి సంస్థ విస్తరణకు, అభివృద్ధికే వెచ్చించాలి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాలేదనే సాకుతో విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయరాదు.
యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఏపీఎస్సీహెచ్ఈ వంటి రేగులటరీ అథారిటీ సంస్థల మార్గదర్శకాలను, ఆదేశాలను విధిగా పాటించాలి. ఆన్లైన్ అఫ్లియేషన్, అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలి. విద్యార్థులవారీగా అకడమిక్ పెర్ఫార్మెన్సు రికార్డులను సంబంధిత విభాగాలకు ఆన్లైన్లో పంపించాలి. ఆలా పంపిన దానికి అకనాలెడ్జి పొందాలి.
విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది హాజరును తప్పనిసరిగా ఆధార్ తో లింక్ చేసిన బయోమెట్రిక్ హాజరు ద్వారా రికార్డు చేయాలి. 75 శాతం హాజరు లేకపోతే ఫీజు రేయింబర్సుమెంట్ కు అర్హులు కారు. సెక్యూరిటీ, డేటా సీక్రెసీ ప్రోటోకాల్ను విధిగా పాటించాలి. ప్రభుత్వం, సంబంధిత రెగ్యులేటరీ సంస్థలు అనుమతించే కోర్సులతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్కు నిర్దేశించిన కోర్సులను మాత్రమే నిర్వహిస్తూ ఉండాలి.
విధివిధానాలు, మార్గదర్శకాలు పాటించకుండా వ్యవహరించే సంస్థలు, యాజమాన్యాలపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుంది. ఆ కాలేజీలను ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నుంచి శాశ్వతంగా తొలగించే అథారిటీ ప్రభుత్వానికి ఉంటుంది.
ఫీజు రీయింబర్స్మెంట్కు నిర్దేశించిన ఆదాయ పరిమితి ప్రకారం గుర్తింపు కలిగిన సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేట్ వర్సిటీలకు ఈ పథకం వర్తించదు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కరస్పాండెన్స్ కోర్సులు చదివే విద్యార్థులు, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా విద్యార్థులకు జగనన్న విద్య దీవెన పథకం వర్తించదు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ పథకానికి నోడల్ విభాగంగా పనిచేస్తుంది.