దగ్గుబాటికి తాజా సెగ.. అటో ఇటో తేల్చుకోవాలని అల్టిమేటమ్ !

సీనియర్ రాజకీయవేత్త, స్వర్గీయ ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వైసీపీలో సెగ మొదలైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈసారి సెగకు డెడ్ లైన్ కూడా తోడవడంతో ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనుకోకుండా వైసీపీలో చేరి పరుచూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఓటమి పాలైనప్పటికీ పార్టీలో ఎంతో కొంత పలుకుబడి మెయింటేన్ చేసిన దగ్గుబాటికి ఇటీవల సొంత […]

దగ్గుబాటికి తాజా సెగ.. అటో ఇటో తేల్చుకోవాలని అల్టిమేటమ్ !
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 12, 2019 | 7:51 PM

సీనియర్ రాజకీయవేత్త, స్వర్గీయ ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వైసీపీలో సెగ మొదలైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈసారి సెగకు డెడ్ లైన్ కూడా తోడవడంతో ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనుకోకుండా వైసీపీలో చేరి పరుచూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఓటమి పాలైనప్పటికీ పార్టీలో ఎంతో కొంత పలుకుబడి మెయింటేన్ చేసిన దగ్గుబాటికి ఇటీవల సొంత నియోజకవర్గం నుంచే సెగ మొదలైంది.

పోలీసు అధికారులతో పాటు ఇతర నియోజకవర్గ స్థాయి అధికారులు ఆయన సిఫార్సుతోనే పోస్టింగ్‌లు పొందారు. దాంతో ఆయన గెలవకపోయినా అనధికారిక ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారని అనుకున్నారు. అయితే హఠాత్తుగా సీన్ మారిపోయింది. దగ్గుబాటికి తెలియకుండానే పర్చూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు రామనాథంబాబును తిరిగి పార్టీలోకి తీసుకున్నారు.

నియోజకవర్గానికి సంబంధించి రామనాథంబాబు మాటలకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు, పార్టీ నేతలకు సందేశం వెళ్లిపోయింది. రావి రామనాథంబాబు ఎన్నికలకు ముందు పర్చూరు వైసీపీ ఇన్‌చార్జ్. దగ్గుబాటి వైసీపీలో చేరడంతో రామనాథంబాబుకు ఆ పార్టీలో ఆదరణ దక్కలేదు. దాంతో ఆయన టీడీపీలో చేరారు. ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం ఆయన కృషి చేశారు. కానీ హఠాత్తుగా ఆయనను పిలిచి మరీ వైసీపీలో చేర్చుకున్నారు వైసీపీ అధినేత జగన్. ఆయనే స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అప్పటి నుంచి దగ్గుబాటికి పర్చూరులో ప్రాధాన్యత లేకుండా పోయింది. మాట మాత్రమైన తనకు చెప్పకుండా రామనాథంబాబును పార్టీలోకి చేర్చుకోవడం.. తనకు ప్రధాన్యత తగ్గించడంతో దగ్గుబాటి అసహనానికి గురయ్యారు. ఈ విషయంపై చర్చించేందుకు ఆయన జగన్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న విజయసాయిరెడ్డిని అయినా కలుసుకుని ఏం జరుగుతుందో తెలుసుకుందామనుకుంటే దానికి కూడా అవకాశం ఇవ్వనట్లు సమాచారం.

అయితే జగన్‌తో భేటీ కావాలంటే ముందుగా ఓ అంశంపై క్లారిటీ ఇవ్వాలంటూ దగ్గుబాటికి సమాచారం పంపినట్లుగా తాజాగా ప్రచారం మొదలైంది. బిజెపిలో వున్న కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి కూడా వైసీపీలో చేరాలంటూ అల్టిమేటం జారీ చేసినట్లు తెలిసింది. దంపతులిద్దరూ చెరోపార్టీలో ఉండడం వల్ల సమస్యలు వస్తున్నాయని, పురంధేశ్వరి కూడా వైసీపీలోకి వస్తే ప్రాధాన్యమిస్తామని, లేకపోతే ఎవరూ పార్టీకి అవసరం లేదన్నట్లుగా సమాచారం పంపినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు కూడా పురంధేశ్వరి బిజెపిలోనే వున్నారు. ఆమె అక్కడ వుండగానే దగ్గుబాటిని వైసీపీలో చేర్చుకున్నారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు చెబుతున్నారని దగ్గబాటి కుటుంబంలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితిల్లో ఆమె బీజేపీని వీడే అవకాశమే లేదు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దానికి తోడు పార్టీ కోసం కష్టపడే నేతగా బీజేపీలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఏపీ నుంచి జాతీయ స్థాయిలో ఏ పదవులనైనా భర్తీ చేయాలనుకుంటే బీజేపీ నేతలు పురంధేశ్వరి పేరును కూడా ప్రముఖంగా పరిశీలిస్తారు. అలాంటి పార్టీని వీడి వైసీపీలో చేరే అవకాశమే లేదని చెబుతున్నారు. తాజా అల్టిమేటమ్ నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.