ముస్లింలకు జగన్ కీలక ఆదేశాలు
ఏపీలో రంజాన్ నెల ప్రత్యేక ప్రార్థనలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముస్లిం మత పెద్దలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. కరోనా ప్రభావం ఒకవైపు పెరుగుతుండడం, లాక్ డౌన్ ఇంపార్టెన్స్ కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకోవడంతో ముస్లిం మత పెద్దలతో...
ఏపీలో రంజాన్ నెల ప్రత్యేక ప్రార్థనలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముస్లిం మత పెద్దలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. కరోనా ప్రభావం ఒకవైపు పెరుగుతుండడం, లాక్ డౌన్ ఇంపార్టెన్స్ కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకోవడంతో ముస్లిం మత పెద్దలతో సమావేశం కావాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి, సోమవారం వారితో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమయ్యారు.
ఈ వీడియోకాన్ఫరెన్సులో ముస్లిం మత పెద్దలతోపాటు జిల్లా కలెక్టర్లు కూడా పాల్గొన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదేనని కానీ, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని ఈసారి రంజాన్ ప్రార్థనలను ఎవరి ఇళ్ళలో వారు చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయాలే తెలిపిన ముఖ్యమంత్రి, కరోనా వైరస్ను అంతమొందించేందుకు గత కొన్ని రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలన్నీ ఇళ్లల్లోనే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని, ఇప్పుడు రంజాన్ నెల కూడా వచ్చిందని ఆయనన్నారు.
ఇళ్లలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ రంజాన్మాసంలో ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లింలందరినీ అభ్యర్థిస్తున్నానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పండంటూ ముస్లిం మత పెద్దలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ‘‘ ఇది మనసుకు కష్టమైన మాట అయినా సరే.. చెప్పక తప్పని పరిస్థితి ’’ అని సీఎం అన్నారు.