Jagan decision సీఆర్డీఏపై జగన్ కీలక నిర్ణయం.. సుప్రీంలో త్వరలో పిటిషన్
ఒకవైపు కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటూనే ఏపీ సీఎం రాజధాని విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ దిశగా తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు.
CM Jagan has taken crucial decision with regard to CRDA: ఒకవైపు కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటూనే ఏపీ సీఎం రాజధాని విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ దిశగా తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఆధారంగా తీసుకున్న చర్యలతో త్వరలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు రెడీ అవుతోంది ఏపీ ప్రభుత్వం.
రాజధానిలో అందరికీ ఇళ్ల పథకం వర్తింపుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అందరికీ ఇళ్ల పథకం అమలు కోసం అవసరమైన పక్షంలో సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పులు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ చట్టం పరిధిలోనే మాస్టర్ ప్లానులో మార్పులుండాలని స్పష్టీకరించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పథకం అమలు చేసేలా ప్రక్రియ ప్రారంభించాలని గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది.
రాజధాని పరిధిలో పేదల ఇళ్ల కోసం 1251.51 ఎకరాలను ప్రభుత్వం ఇదివరకే సిద్దం చేసింది. నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడం గ్రామాల్లో అందరికీ ఇళ్ల పథకం కింద పట్టాల పంపిణీకు భూమిని సిద్దం చేసుకుంటోంది సర్కార్. తాడేపల్లి, మంగళగిరి మునిసిపాటీల పరిధిలోని పేదలకు రాజధానిలో ఇళ్ల కేటాయించేందుకు రంగం సిద్దం చేస్తోంది. తాడేపల్లి, దుగ్గిరాల, మంగళగిరి, పెదకాకాని మండలాల్లోని పలు గ్రామాల్లోని పేదలకు ఇళ్ల కేటాయింపు జరపాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు.
అయితే.. రాజధానిలో ఇళ్ల కేటాయింపు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 107ను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. పేదలకు ఇళ్ల పథకం కోసం గుర్తించిన భూమిని రెవెన్యూకు అప్పగించేలా ఉత్తర్వులిచ్చారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనున్నట్టు తాజా జీవోలో వెల్లడించారు. సీ.ఆర్.డీ.ఏ. చట్టం ప్రకారం ఇళ్ల నిర్మాణాలే కానీ స్థలాల కేటాయింపు లేదని గతంలో హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. ముందుగా ఇంటి స్థలాన్ని మంజూరు చేసి, ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో ఇళ్ళు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు జీ.ఓ.నెంబర్ 99లో పేర్కొన్నది ఏపీ ప్రభుత్వం.
తాజాగా విడుదల చేసిన జీఓ నెంబర్ 131లో గుంటూరు, కృష్ణా జిల్లాల పేదలకు ఇళ్ళ స్థలాలతో పాటు ఇంటి నిర్మాణాలకు అవసరమైన 1251 ఎకరాలను కేటాయించాలని సీఆర్డీఏ కమిషనర్ను ఆదేశించింది జగన్ ప్రభుత్వం.