లాక్డౌన్ ఎఫెక్ట్: వీడియో కాల్లో తల్లి అంత్యక్రియలు చూసిన ప్రముఖ హీరో..!
కరోనా విస్తరణను కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్తో ఎన్నో కుటుంబాలు తీవ్ర వ్యథని అనుభవిస్తున్నాయి. కొందరు వేరే ప్రదేశాల్లో చిక్కుకుపోయి బాధపడుతుంటే.. మరికొందరు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు
కరోనా విస్తరణను కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్తో ఎన్నో కుటుంబాలు తీవ్ర వ్యథని అనుభవిస్తున్నాయి. కొందరు వేరే ప్రదేశాల్లో చిక్కుకుపోయి బాధపడుతుంటే.. మరికొందరు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సొంతింటి వాళ్లు చనిపోతే వారి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోవడం వంటి సన్నివేశాలు చూస్తుంటే చాలామంది కడుపు తరక్కుపోతోంది. తాజాగా చనిపోయిన తన తల్లి చివరి చూపును కూడా చూడలేకపోయారు ప్రముఖ నటుడు.
వివరాల్లోకి వెళ్తే., బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీద బేగం వృద్ధాప్య సమస్యలతో శనివారం మరణించారు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో ఇర్ఫాన్ ముంబయిలో లాక్ అయ్యి ఉన్నారు. ఈ క్రమంలో ఆమె అంత్యక్రియలను వీడియో కాన్ఫరెన్స్లో చూశారు ఈ నటుడు. జైపూర్లోని చుంగీ నక గ్రేవ్యార్డ్లో సయీద బేగం అంత్యక్రియలు జరగ్గా.. కొంతమంది కుటుంబసభ్యులు మాత్రమే ఇందులోపాల్గొన్నారు. ఇదిలా ఉంటే 2018లో క్యాన్సర్ బారిన పడిన ఇర్ఫాన్ లండన్లో ట్రీట్మెంట్ తీసుకొని గతేడాది దేశానికి తిరిగి వచ్చారు. ఆ తరువాత మళ్లీ ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఇర్ఫాన్ ముంబయిలో ఉంటున్నారు. ఇదిలా ఉంటే తమ తల్లి మరణంపై ఇర్ఫాన్ సోదరుడు సల్మాన్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా మా తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల కూడా ఇర్ఫాన్ ఆరోగ్యంపై ఆరా తీశారు అని అన్నారు. మరోవైపు ఇర్ఫాన్ తల్లి మరణంపై బాలీవుడ్ ప్రముఖులు సంఘీబావం ప్రకటిస్తున్నారు.
Read This Story Also: కరోనా వైరస్.. హీరోయిన్ ప్రణీత చేస్తోన్న సేవను మెచ్చుకోవాల్సిందే..!