ఐపీఎల్ టోర్నమెంట్కు ఎడారి దేశం సన్నద్ధం!
మూడున్నర దశాబ్దాల కిందట షార్జాలో క్రికెట్ అంటే ఎడారిలో మ్యాచ్లేమిటని ఆశ్చర్యపోయారు? 1984లో మొదటిసారిగా ఆసియా కప్కు ఆతిథ్యమిచ్చిన షార్జా క్రికెట్ స్టేడియం ఆ తర్వాత పాపులర్ స్టేడియంగా అవతరించింది.
మూడున్నర దశాబ్దాల కిందట షార్జాలో క్రికెట్ అంటే ఎడారిలో మ్యాచ్లేమిటని ఆశ్చర్యపోయారు? 1984లో మొదటిసారిగా ఆసియా కప్కు ఆతిథ్యమిచ్చిన షార్జా క్రికెట్ స్టేడియం ఆ తర్వాత పాపులర్ స్టేడియంగా అవతరించింది.. ఏడాదికి రెండేసి టోర్నమెంట్లను నిర్వహిస్తూ క్రికెట్కు సరికొత్త క్రేజ్ను తీసుకొచ్చింది.. టోర్నమెంట్లతో పాటు క్రికెట్ ఆటగాళ్లను ఆర్ధికంగా ఆదుకుంది.. అబ్దుల్ రహ్మాన్ బుఖాతిర్ చలవతో స్టేడియం రెండు వందలకు పైగా వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లకు వేదికయ్యింది.. ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా షార్జాలో పర్యటించేందుకు ఏ దేశమూ ముందుకు రాకపోవడంతో అది ఆదరణ కోల్పోయింది.. అప్పటికే క్రికెట్ రుచి ఎరిగిన అరబ్ దేశం షార్జాతో ఆగిపోలేదు.. అబుదాబి, దుబాయ్లలోనూ క్రికెట్ స్టేడియంలను నిర్మించింది..
ఉగ్రవాద చర్యల కారణంగా పాకిస్తాన్లో ఏ క్రికెట్ జట్టూ పర్యటించడం లేదు.. అందుకే పాకిస్తాన్తో తలబడే దేశాలు తటస్థ వేదిక అయిన అబుదాబీలోనే టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాయి.. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. కరోనా కష్టకాలంలో ఇప్పుడు ఆ ఎడాది దేశమే ఆటలకు నెలవయ్యింది.. కాసులను కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ను నిర్వహించే బాధ్యతను భుజాన వేసుకుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్..
నిజానికి షెడ్యూల్ ప్రకారం మొన్నటి వేసవిలో అంటే ఏప్రిల్- మే మాసంలోనే ఐపీఎల్ టోర్నమెంట్ జరగాలి.. కాని ముదనష్టపు కరోనా రావడంతో అన్నిటితో పాటు ఆటలను బంద్ చేయాల్సి వచ్చింది.. అంతకు ముందే లాక్డౌన్ విధించింది భారత్.. ఇక మార్చిలో జరగాల్సిన దక్షిణాఫ్రికా సిరీస్ కూడా జరగలేదు.. కరోనా కారణంగా దక్షిణాఫ్రికా టీమ్ వన్డే సిరీస్ను రద్దు చేసుకుంది.. అంతర్జాతీయ మ్యాచ్లే కాదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లను నిర్వహించలేని పరిస్థితి వచ్చేసింది.. బీసీసీఐకి ఏం చేయాలో పాలుపోలేదు.. ఐపీఎల్ను నిర్వహించాలా రద్దు చేయాలా అన్నది తేల్చుకోలేకపోయింది..
టీ -20 వరల్డ్కప్ టోర్నీనే వాయిదా పడినప్పుడు ఐపీఎల్ ఎంత? దాన్ని కూడా వాయిదా వేయడమే మంచిదని చాలా మంది సలహా ఇచ్చారు.. వాయిదా వేయవచ్చు కానీ .. ఎంతకాలం ? ఐపీఎల్ ఏడాదికోమారు జరిగే టోర్నమెంట్ … ఎంత వాయిదా వేసినా ఈ ఏడాదిలోనే జరపాలి.. ఈ మధ్యన ఐపీఎల్ను తాము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు హింటిచ్చింది.. అదే సమయంలో తామూ రెడీనే అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చెప్పింది.. ఎంతకాలం ఆటలకు దూరంగా ఉంటామన్న ఉద్దేశంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఓ సాహసం చేసింది.. బయో బబుల్ సెక్యూరిటీలో వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ను హోస్ట్ చేసింది.. స్టేడియంలో ప్రేక్షకులు లేకపోయినా మ్యాచ్లు మాత్రం గొప్పగా జరిగాయి.. ఇదేదో బాగానే ఉందే అనిపించింది.. వెంటనే బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చింది.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఐపీఎల్ జరపాలని డిసైడ్ అయ్యింది..
ఎలాగూ ప్రేక్షకులు లేకుండానే టోర్నమెంట్ నిర్వహించాలనుకున్నప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్సే ఎందుకు? అదేదో భారత్లోనే నిర్వహించవచ్చు కదా అన్న ప్రశ్నలు వచ్చాయి.. అయితే భారత్లో కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్రమవుతోంది.. ఎక్కడ నిర్వహించినా కష్టమే! మనదేశంలో బయో బబుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం కూడా కష్టమే! పైగా ఇంతటి సంక్లిష్ట సమయంలో క్రికెట్ పోటీలు ఎందుకు? అన్న విమర్శలు కూడా రావచ్చు.. అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్వైపు మొగ్గు చూపింది బీసీసీఐ.. క్రికెట్ బోర్డు ప్రతిపాదనకు ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది.. యూఏఈలో కరోనా లేదా అంటే అక్కడా ఉంది.. తీవ్రంగానే ఉంది. అదే సమయంలో కఠినచట్టాల కారణంగా నియంత్రణలో ఉంది.. అందుకే ఐపీఎల్ను అక్కడ నిర్వహించాలనుకున్నారు.. పరిస్థితులకు అలవాటుపడేందుకు, క్వారంటైన్ నిబంధనను పాటించేందుకు అన్ని జట్లు కాసింత ముందుగానే యూఏఈలో అడుగు పెట్టాయి.. ప్రాక్టీసు చేస్తున్నాయి.. బయో బబుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటాన్ని అలవాటు చేసుకున్నారు ఆటగాళ్లు. నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు..
మొదట్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు.. అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. స్టేడియంలో ప్రేక్షకులు ఉండరనే చిన్న వెలితే తప్ప క్రికెట్ రసాస్వదనకు ఎలాంటి ఢోకా ఉండదు.. హాయిగా ఇంటిపట్టునే ఉంటూ క్రికెట్ అభిమానులు చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. గతంలో కూడా స్టేడియంలో వీక్షించే ప్రేక్షకుల కంటే టెలివిజన్లో చూసి ఆనందించేవారే ఎక్కువ.. ఎంత కాదనుకున్నా గత ఐపీఎల్ టోర్నమెంట్లతో పోలిస్తే ఇది కాస్త ఢిఫరెంట్.. బీసీసీఐకి కాసింత అదనపు భారమే పడింది.. వేరే దేశంలో టోర్నీని నిర్వహించడం వల్ల ఖర్చులు పెరిగాయి.. చైనా కారణంగా టైటిల్ స్పాన్సర్షిప్ విలువలో సగం డబ్బులే వచ్చాయి..ఇప్పుడున్న పరిస్థితులలో టోర్నీని నిర్వహించడం భారమే అయినా ఫ్రాంచైజీలు ఇచ్చిన ప్రోత్సాహంతో బోర్డు ముందుకు సాగుతోంది.. ఇప్పుడు లాభాలు కాదు ముఖ్యం.. ఆట జరగడమే ప్రాధాన్యం అన్న భావనకు అందరూ వచ్చేశారు.. మరో మూడు రోజులలో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..