వైసీపీ నేతల మధ్య మాటల పోరు
నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంటరీ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే ఎంపీ దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసనలు తెలుపుతున్నారు.
నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంటరీ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే ఎంపీ దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసనలు తెలుపుతున్నారు. మంత్రి రంగనాథరాజుతో పాటు ఎమ్మెల్యేలు, పలువురు వైసీపీ నేతలపై ఎంపీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ కార్యకర్తుల రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఇటీవల వైసీపీ నేతలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో జిల్లా నేతలు ఆయనపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. సీఎం జగన్ హవాతో నరసాపురం ఎంపీగా గెలిచి పార్టీ నేతలను విమర్శించడంపై నేతలు మండిపడుతున్నారు. ఏకంగా మార్టేరు సెంటర్లో రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మను దహనం చేసి పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి శ్రీరంగనాథరాజుకు క్షమాపణ చెప్పకపోతే పార్లమెంట్ నియోజకవర్గంలో తిరగనివ్వబోమని సొంత పార్టీ నేతలే హెచ్చరించారు. ఆకివీడు వైఎస్ఆర్ సెంటర్లో ఎంపీ ఫ్లెక్సీపై పసుపు నీళ్లు చల్లి, గాజులు తొడిగి, కోడిగుడ్లు, టమోటాలతో కొట్టిపార్టీ నుంచి రఘురామకృష్ణంరాజును తొలగించాలని ఆకివీడు వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. మంత్రితో పాటు ఇతర ఎమ్మెల్యేలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపణలు నిరాధారమని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. అయితే, మరోవైపు ఎంపీ రఘురామకృష్ణంరాపజు దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనపై ఎంపీ పీఏ ఫిర్యాదు మేరకు ఆచంట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 17న ఆచంట, అకివీడులో ఎంపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, అంతే స్థాయిలో వైసీపీ నేతలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. తనను గెలిపించిన పార్టీ నేతలపైనే కేసులు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆర్థిక నేరస్థుడని, గతంలో ఢిల్లీలో పలు కేసులు ఆయనపై ఉన్నట్లు తమకు తెలియదన్నారు. ఎంపీతో కలిసి పని చేసేదిలేదని తేల్చి చెబుతున్నారు సత్యనారాయణ.