పెరిగిపోతున్న ఖర్చులకు కారణం.. కేంద్రం ఆర్ధిక విధానాలేనా?

దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రులు, నేతలు అసహజమై వ్యాఖ్యానాలు చేయడం దేశ ప్రజానీకాన్ని కలవరపరుస్తోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న ఆర్థిక మాంధ్యం ఈ నేతల హాస్యపూరిత ప్రకటనలతో తగ్గే పరిస్థితి ఎంతమాత్రం లేదని ఆర్ధిక వేత్తలు అంటున్నారు. ఇటీవల దేశంలో తయారయ్యే మారుతీ కార్ల అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయి. దీంతో ఈ కంపెనీల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించింది. అదే విధంగా హెవీ వెహికల్స్ మారు పేరైన అశోక్ లేలాండ్ కంపెనీ కూడా సరైన […]

పెరిగిపోతున్న ఖర్చులకు కారణం.. కేంద్రం ఆర్ధిక  విధానాలేనా?
Follow us

| Edited By:

Updated on: Sep 16, 2019 | 2:30 PM

దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రులు, నేతలు అసహజమై వ్యాఖ్యానాలు చేయడం దేశ ప్రజానీకాన్ని కలవరపరుస్తోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న ఆర్థిక మాంధ్యం ఈ నేతల హాస్యపూరిత ప్రకటనలతో తగ్గే పరిస్థితి ఎంతమాత్రం లేదని ఆర్ధిక వేత్తలు అంటున్నారు. ఇటీవల దేశంలో తయారయ్యే మారుతీ కార్ల అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయి. దీంతో ఈ కంపెనీల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించింది. అదే విధంగా హెవీ వెహికల్స్ మారు పేరైన అశోక్ లేలాండ్ కంపెనీ కూడా సరైన అమ్మకాలు లేనందున కంపెనీ ఉద్యోగులకు సుధీర్ఘంగా సెలవులు ప్రకటించింది. ఈ పరిస్థితి దేశంలో ఆర్ధిక పరిస్థితికి అర్ధం పడుతుందని నిపుణులు హెచ్చరించారు. అయితే దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానిస్తూ దేశంలో ఓలా, ఉబర్ వంటి కార్లను అధికంగా వినియోగించడంతో కార్ల అమ్మకాలు పడిపోయాయని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే దిగజారి పోతున్న ఆర్దిక పరిస్థతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాత్రం ఐన్‌స్టీన్ గురుత్వాకర్షణ అంటూ వెటకారమాడారు. బీహార్ ఆర్ధిక మంత్రి సుశీల్ మోడీ వర్షాలు విపరీతంగా కురుస్తున్నందున కార్లు కొనుక్కోవడం లేదంటూ మరీ అర్ధం లేకుండా వ్యాఖ్యానించారు. అయితే మంత్రి పీయూష్ గోయల్ చేసిన కామెంట్‌పై సోషల్ మీడియా ఏకి పారేసింది. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది సర్ ఐజక్ న్యూటన్ అని, ఐన్‌స్టీన్ కాదంటూ ట్రోల్ చేశారు నెటిజన్లు. అయితే ఆ తర్వాత తన వ్యాఖ్యల వెనక్కి తగ్గి తన పొరబాటుకు వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది.

దేశం ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఆర్ధిక సంక్షోభం దిశగా పయనిస్తున్నట్టు నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంలో ప్రధాని మోడీ విఫలమవుతున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆర్ధిక మంత్రి నిర్మలా మరో ప్రకటన చేశారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, రాబోయే రోజుల్లో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్స్ వంటివి నిర్వహిస్తామని ప్రకటించారు. దుబాయ్‌ ఆర్ధిక పరిస్థితికి మనకి అసలు సంబంధమే లేదు. అక్కడి భూ భౌతిక పరిస్థితులు, మనకు ఇక్కడి పరిస్థితులకు ఎంతో వైవిధ్యముంది. ముఖ్యంగా మన ఆర్ధిక వ్యవస్థ మొత్తం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడింది. దేశంలో ఎన్నో లక్షల ఎకరాలు ఇప్పటికీ సాగులోకి రావడం లేదు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే అన్ని రంగాల్లో కొనుగోలు శక్తి వృద్ధి చెందుతుంది. దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా మనకు ఏమాత్రం సంబంధం లేని వాటిని ఫోకస్ చేయడంలో కారణం ఏమిటో అంటూ ఆర్ధిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆర్దిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 5శాతానికి పడిపోవడం నిరాశ కలిగించే అంశమే. మన స్థూల జాతియోత్పత్తి వృద్ధి రేటు కనీసం 8 శాతమైనా ఉండాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఒక త్రైమాసికంలో 3 శాతం వృద్ధి తగ్గిందంటే దాని అర్ధం రూ.6 లక్షల కోట్లు నష్టమంటున్నారు.

ఇప్పటికే మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ దేశ ఆర్ధిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. జీడీపీ 5 శాతానికి పడిపోవడం చూస్తే ఆర్ధిక వ్యవస్థ మందగమనంలో ఉన్నట్టుగా తెలుస్తుందన్నారు. దేశంలో ఈ పరిస్థితికి ప్రధాని మోదీ విధానాలే కారణమంటూ విమర్శించారు. వృద్ధి రేటు వేగంగా ఉన్నప్పటికీ అసమర్ధ నిర్ణయాల వల్ల ఈ దుస్థితి ఏర్పడిందంటూ ఆయన ఆరోపించారు. నోట్లు రద్దు, జీఎస్టీ అమలులో లోపాల ప్రభావం నుంచి దేశ ఆర్ధిక వ్యవస్ధ ఇంకా కోలుకునే పరిస్థితి రాదని మన్మోహన్ వ్యాఖ్యానించారు. ఆదాయం గణనీయంగా పడిపోవడంతో రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని కార్మికులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మందగమనం దేశంలోని మొత్తం 50 శాతం మంది ప్రజలపై పెను ప్రభావం చూపిందని, వారి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని అన్నారు. ఒక్క ఆటోమొబైల్ రంగంలోనే 3.5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం రాజకీయాల్ని పక్కనబెట్టి నిపుణులు, మేధావుల్ని సంప్రదించాలని సూచించారు.

కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో ఆర్ధిక సంక్షోభం పెరుగుతుందనే వార్తలు సామాన్యుణ్ని కలవరపెడుతున్నాయి. ద్రవ్యోల్బణం నిలకడగానే ఉందని కేంద్రమంత్రి చెబుతున్నా రోజు రోజుక పెరుగుతున్న ధరలకు మాత్రం ఎవ్వరూ కళ్లెం వేయలేకపోతున్నారు. నిరుద్యోుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, దేశంలో యువత నిరాశకు కారణమవుతుంది. ముఖ్యంగా అనేక ఆర్ధిక నేరాలు కూడా పెరగడం దీనికి ఒక కారణమంటున్నారు నిపుణులు. కేంద్రం ఇప్పటికైనా ఉత్పదక శక్తులకు ఊతమిచ్చి నిరుద్యోగం తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అదే సమయంలో దేశంలో సాగులోకి రాని లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చి రైతును బతికించాలని, వ్యవసాయానికి సరికొత్త ఊపిరులూదాలని కోరుతున్నారు. ఒకవైపు ఆర్ధిక మందగమనానికి కారణాలు చెప్పకుండా వెటకారంగా మాట్లాడటం, హాస్యపూరిత వ్యాఖ్యలు చేయడాన్ని తగ్గించి ద్రవ్యోల్పణాన్ని తగ్గించే దిశగా ఆలోచించాలని కోరుతున్నారు.