కరోనా వైరస్ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్ అమ్మకాలు!
కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. దేశవ్యాప్తంగా చికెన్ అమ్మకాలు నెల రోజుల్లో 50 శాతానికి పడిపోయాయి.
కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. దేశవ్యాప్తంగా చికెన్ అమ్మకాలు నెల రోజుల్లో 50 శాతానికి పడిపోయాయి. ఫాం గేట్ ధర 70 శాతం తగ్గింది. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు రావడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని గోద్రెజ్ అగ్రోవెట్ ఎండీ బి.ఎస్.యాదవ్ తెలిపారు.వారానికి 6 లక్షల కోళ్లు విక్రయించేవారమని, నెల రోజుల్లో 40 శాతం అమ్మకాలు తగ్గాయని చెప్పారు.
కరోనా వైరస్ ప్రభావం తగ్గితే, ధరలు పెరుగుతాయని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రతి వారం 7.5 కోట్ల కోళ్లు అమ్ముడవుతున్నాయని, ఇది 3.5 కోట్ల కోళ్లకు వచ్చిందని గుర్తుచేశారు. కాగా, హైదరాబాద్ మార్కెట్లో కొద్ది రోజుల క్రితం స్కిన్లెస్ చికెన్ మాంసం రూ.250 దాకా దూసుకెళ్లింది. గత వారం రూ.110కి దిగొచ్చి ప్రస్తుతం రూ.130 పలుకుతోంది.
కరోనా వైరస్ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమ రూ.700 కోట్ల వరకు నష్టపోయిందని రామ్ రెడ్డి వెల్లడించారు. కోడి ఉత్పత్తి వ్యయం కిలోకు రూ.80 అవుతోందని, విక్రయ ధర సగానికి పడిపోవడంతో పౌల్ట్రీ సంస్థలు నష్టాలను మూటగట్టుకున్నాయని చెప్పారు. ఈ నష్టం దేశవ్యాప్తంగా ఎంత కాదన్నా రూ.7,000 కోట్ల పైచిలుకు ఉంటుందని ఆయన అంచనాగా వెల్లడించారు. తమకు సంబంధం లేకపోయినా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.