#COVID19 అమెరికాలో భారతీయులపై ప్రత్యేక ఆంక్షలు
కరోనా భయాందోళన రోజురోజుకూ రెట్టింపవుతోంది. నియంత్రణ చర్యలు కూడా అదే స్థాయిలో వేగవంతమవుతున్నాయి. కానీ అమెరికాలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. భారతీయ అమెరికన్లపై ప్రత్యేక ఆంక్షలు విధించడంతో ప్రవాస భారతీయులు నానా అగచాట్లు పడుతున్నట్లు సమాచారం.
Indian americans are suffering like hell in pandemic situation: యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. గంట గంటకు పెరుగుతున్న మరణాలు… బయట పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. వెరసి ఎక్కడ చూసినా ఏదో భయాందోళన వ్యక్తమవుతోంది. వైరస్ ప్రభావం నుంచి చైనా, సింగపూర్, హాంగ్కాంగ్ వంటి దేశాలు కోలుకుంటుండగా.. ఇటలీ, స్పెయిన్, ఇరాన్, అమెరికా లాంటి దేశాలు వణికిపోతున్నాయి. పెరుగుతున్న మరణాలతో ఇటలీ అతలాకుతలమవుతోంది.
వైరస్ బారిన పడిన మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 11 వేల 500 మంది మరణించారు. రెండు లక్షల 76 వేల 170 మంది ప్రాణాలతో లగాటమాడుతోంది ఈ మహమ్మారి. కోవిడ్-19 ధాటికి బెంబేలెత్తిపోతున్న ఇటలీలో మృతుల సంఖ్య నాలుగువేలకు దాటింది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 627 మంది కన్నుమూసినట్లు ఇటలీ ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. అలాగే, కేసుల సంఖ్య 47 వేలు దాటింది. ఇరాన్లో మృతుల సంఖ్య 1433కి చేరింది.
అమెరికాలోనూ కోవిడ్-19 మృతుల సంఖ్య 200 దాటిపోయింది. అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తోంది. దాదాపు 12 వేల కేసులు నమోదవడంతో దాదాపు సగం రాష్ట్రాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో భారతీయ దుకాణాలు మూసి వేశారు. దీంతో నిత్యావసర వస్తువులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిలికాన్ వ్యాలీగా పిలిచే శాన్ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా పూర్తిగా మూతపడింది.
కొద్ది సంఖ్యలో వ్యాపార సంస్థలు తెరిచి ఉంటున్నా వాటిలో నిత్యావసర వస్తువులు దొరకడం లేదు. గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ సహా వందలాది కంపెనీల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య కేంద్రాల్లో అగ్రగామి న్యూయార్క్ పూర్తిగా స్తంభించింది. పొరుగునే ఉన్న న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. న్యూయార్క్లో కేసులు పెరుగుతుండటంతో అధికారులు ప్రజలను వీధుల్లోకి రావొద్దని హెచ్చరించారు. నైట్ క్లబ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి.
వాషింగ్టన్, ఫ్లోరిడా, ఇల్లినాయీస్, షికాగో, లూసియానా, జార్జియా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలను ఇళ్లకు పరిమితం చేయాలని స్థానిక ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రారంభ దశలో వాషింగ్టన్, న్యూయార్క్, కాలిఫోర్నియా రాష్ట్రాలకే పరిమితమైన వైరస్… ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాలను తాకింది. అత్యధికంగా న్యూయార్క్లో 4,152 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి దాకా వాషింగ్టన్లో 1,228, కాలిఫోర్నియాలో 1,044, న్యూజెర్సీలో 742 కేసులు నమోదయ్యాయి. న్యూజెర్సీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వైరస్ బారిన పడి మృతి చెందారు.
వంద అంతకంటే ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, టెక్సాస్, కొలరాడొ, మసాచ్యూసెట్స్, లూసియానా, ఇల్లినాయీ, జార్జియా, ఫ్లోరిడా ఉన్నాయి. వాటిలో కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీలలో భారతీయులు అందులోనూ తెలుగువారు లక్షల్లో నివసిస్తున్నారు. కరోనా వైరస్ దృష్ట్యా ఇళ్లకే పరిమితం కావాలని కాలిఫోర్నియా ప్రభుత్వం హెచ్చరించడంతో శాన్ఫ్రాన్సిస్కో, లాస్ఏంజిలెస్, శాన్జోస్ నగరాలు నిర్మానుష్యంగా మారాయి.
భారతీయులు ఆధారపడే దుకాణాలు మూసి ఉండటంతో వేలాది మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరీ ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబాలకు తోటి భారతీయులు తమ దగ్గర ఉన్న నిత్యావసరాల్లో కొన్నింటిని అందజేస్తున్నారు. ఈ పరిస్థితి మారడానికి భారతీయ దుకా ణాలను తెరిపించాలని, అక్కడ నిత్యావసర వస్తువులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సిలికాన్ వ్యాలీ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు కాలిఫోర్నియా గవర్నర్ను కోరారు. న్యూజెర్సీలో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకొనేందుకు తెలుగు సంఘాలు ప్రత్యేక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశాయి.