డ్రాగన్‌ కంట్రీకి వణుకు పుట్టించిన భారత్

లఢాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో జూన్‌ 15న తన బలగాలపై దాడికి తెగబడ్డ చైనాకు భారత్ తగినరీతిలో గుణపాఠం చెప్పింది. అప్రమత్తమైన భారత సైన్యం మెరుపు వేగంతో స్పందిస్తూ.. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోకి తన అగ్రశ్రేణి యుద్ధనౌకను పంపింది. దీంతో డ్రాగన్‌ కంట్రీ కలవరానికి గురైంది.

డ్రాగన్‌ కంట్రీకి వణుకు పుట్టించిన భారత్
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2020 | 2:36 PM

లఢాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో జూన్‌ 15న తన బలగాలపై దాడికి తెగబడ్డ చైనాకు భారత్ తగినరీతిలో గుణపాఠం చెప్పింది. అప్రమత్తమైన భారత సైన్యం మెరుపు వేగంతో స్పందిస్తూ.. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోకి తన అగ్రశ్రేణి యుద్ధనౌకను పంపింది. దీంతో డ్రాగన్‌ కంట్రీ కలవరానికి గురైంది.

దక్షిణ చైనా సముద్రంపై చైనాకు అనేక దేశాలతో వివాదం కొనసాగుతుంది. అక్కడి సహజ వనరులపై కన్నేసిన డ్రాగన్‌.. ఆ సాగరంలో మెజార్టీ భాగం తనదేనంటోంది. సమీప దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్న యధేచ్చగా అక్రమణలకు పాల్పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 2009 నుంచి డ్రాగన్‌.. ఈ ప్రాంతంలో సైనిక మోహరింపులను పెంచింది. కృత్రిమ దీవులనూ నిర్మించింది. గల్వాన్‌ ఘర్షణ జరిగిన వెంటనే భారత్‌.. దక్షిణ చైనా సముద్రంలోకి తన అగ్రశ్రేణి యుద్ధనౌకను పంపినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ చర్య ఆశించిన ఫలితాన్ని ఇచ్చిందని వివరించాయి. భారత్‌తో జరిగిన దౌత్య చర్చల్లో ఈ అంశాన్ని డ్రాగన్‌ లేవనెత్తిందని తెలిపాయి. మన చర్యపై అసంతృప్తి వ్యక్తంచేసిందని పేర్కొన్నాయి.

దక్షిణ చైనా సాగరంలో అమెరికాకు చెందిన భారీ యుద్ధనౌకలూ సంచరిస్తున్నాయి. అక్కడ మోహరించిన భారత యుద్ధనౌక.. రహస్య సాధనాల ద్వారా వీటితో కమ్యూనికేషన్‌ సాగించింది. ఇతర దేశాల యుద్ధనౌకలూ తమ కదలికలను మన నౌకకు తెలియజేశాయి. ఈ ఆపరేషన్‌ మొత్తాన్నీ భారత్‌ గోప్యంగా సాగించిందని భారత సైనిక వర్గాలు తెలిపాయి.

సాగర జలాల్లో తన పోరాట సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత నౌకాదళం వ్యూహ రచన చేస్తోంది. మలాకా జలసంధి నుంచి హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చైనా యుద్ధనౌకల రాకపోకలను సమర్థంగా పర్యవేక్షించేందుకు సెల్ఫ్ డ్రైవ్ జలాంతర నౌకలు, మానవరహిత వ్యవస్థలు, ఇతర సెన్సర్లను తక్షణం సమకూర్చుకోవాలని భారత సైన్యం యోచిస్తోంది.

ఇదే సమయంలో అండమాన్‌కు సమీపంలోని మలాకా జలసంధి వద్ద కూడా భారీగా యుద్ధనౌకలను భారత్‌ మోహరించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించడానికి చైనా నేవీ ఇదే మార్గాన్ని ఉపయోగించుకుంటోంది. చైనా వాణిజ్య నౌకలు కూడా ఎక్కువగా ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటాయి. వీటి కదలికలను కట్టడి చేయడానికి దేశం పక్కా ఫ్లాన్ చేస్తోంది. తూర్పు, పశ్చిమ తీరాల్లో శత్రువులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తిప్పికొట్టే సామర్థ్యం నౌకా దళానికి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆఫ్రికా ఖండంలోని జిబౌటీ వద్ద చైనా యుద్ధనౌకల కదలికలపై కన్నేసి ఉంచామని భారత వర్గాలు పేర్కొన్నాయి. మన మోహరింపుల వల్ల హిందూ మహాసముద్ర ప్రాంతంపై పూర్తి పట్టు సాధించడానికి వీలైందని వివరించాయి. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ శత్రు దేశ కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ప్రణాళికలు రచిస్తున్నట్లు సైనికవర్గాలు వెల్లడించాయి.