కరోనాపై పోరులో సరికొత్త ఆవిష్కరణ.. భారత సంతతి శాస్త్రవేత్త ఘనత..!
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనాపై పోరుకు అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్త
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనాపై పోరుకు అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్త డాక్టర్ మనుప్రకాశ్ సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చారు. విద్యుత్ అవసరం లేకుండా పనిచేయగల సెంట్రీఫ్యూజ్(అపకేంద్ర యంత్రం)ను మనుప్రకాశ్ నేతృత్వంలోని స్టాన్ఫర్డ్ వర్సిటీ బయో ఇంజనీరింగ్ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది.
కోవిద్-19 నిర్ధారణకు లాలాజల(ఉమ్మి) నమూనాలతో పరీక్షలు చేసేందుకు వాడే యంత్రాల్లో ప్రస్తుతం విద్యుత్ ఆధారిత సెంట్రీఫ్యూజ్లు ఉన్నాయి. వీటి ధర వందల డాలర్లలో ఉంటుంది. కానీ మనుప్రకాశ్ అండ్ టీం రూపొందించిన సెంట్రీఫ్యూజ్కు కరెంటు అవసరం లేదు. ధర కూడా చాలా తక్కువ. దాన్ని నేరుగా ‘హ్యాండీఫ్యూజ్’ పరికరంలో అమర్చి.. దానికి ఉండే హ్యాండిల్ను చేతితో తిప్పుతుంటే సెంట్రీఫ్యూజ్ వేగంగా తిరుగుతూ లాలాజల నమూనాల్లోని భాగాలను అపకేంద్ర బలంతో వేరుచేస్తుంది.
కాగా.. హ్యాండీఫ్యూజ్ పరికరంలో ఒక్క సెంట్రీఫ్యూజ్ను అమర్చడానికి రూ.380 కంటే తక్కువే ఖర్చవుతుందని వెల్లడించారు. మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పరీక్షలకు ఈ ఆవిష్కరణ ఊతమిస్తుందని మనుప్రకాశ్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జన్మించిన మనుప్రకాశ్.. ఐఐటీ కాన్పూర్లో బీటెక్, అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎం.ఎస్, పీహెచ్డీ చేశారు.