కేంద్రం హెచ్చరికః అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు..
కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల మరీ అతిజాగ్రత్తతో ..
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇకపై వ్యక్తులపై లేదా గ్రూపులపై రసాయనాలు, శానిటైజర్లు చల్లడానికి వీల్లేదని కేంద్రం తేల్చిచెప్పింది. కరోనా సోకితే… వారిపై ఈ ద్రావణాలు చల్లడం వల్ల ఉపయోగం లేదనీ, శరీరంలోపల ఉన్న కరోనా… బయట స్ప్రేలు చల్లితే ఎలా చస్తుందని కేంద్రం ప్రశ్నిస్తోంది. ఇలాంటి స్ప్రేల వల్ల కరోనా చనిపోతుందనేందుకు ఆధారాలు లేవని చెప్పింది. ఈ రసాయనాలను ఇళ్లలో తలుపులు, కిటికీలు, ఫ్లోర్లను క్లీన్ చేయడానికి వాడాలి గానీ… మనుషులపై కాదని చెప్పిన కేంద్రం… వీటిని చల్లే టప్పుడు చేతులకు గ్లోవ్స్ వేసుకోవాలని సూచించింది.
అంతేగానీ, స్ప్రేలు చల్లితే… కళ్లు, చర్మం పాడవుతాయనీ, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎఫెక్ట్స్ ఏర్పడతాయనీ, వికారం, వాంతుల వంటివి వస్తాయని ఇంకా అనేకానేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటివి చెయ్యకుండా… ఎప్పటికప్పుడు చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కొని…సామాజిక దూరం పాటించాలని కేంద్రం సూచించింది. కాదని ఎవరైనా రసాయనాల్ని మనుషులపై చల్లితే… పాండెమిక్ యాక్ట్ ప్రకారం చర్యలుంటాయని కేంద్రం స్పష్టం చేసింది.