రైతుల ఆందోళన మా ఆంతరంగిక వ్యవహారం, భారత్, కెనడా ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం
రైతుల ఆందోళన మా అంతర్గత వ్యవహారమని, దీనిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు అనుచితమని ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతుల నిరసన గురించి ట్రూడోకు, ఇతర కెనడా నేతలకు సరైన సమాచారం..
రైతుల ఆందోళన మా అంతర్గత వ్యవహారమని, దీనిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు అనుచితమని ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతుల నిరసన గురించి ట్రూడోకు, ఇతర కెనడా నేతలకు సరైన సమాచారం లభించలేదని, వారి కామెంట్స్ సముచితం కాదని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శీవాత్సవ అన్నారు. ఇది ఒక ప్రజాస్వామిక దేశంలోని అంతర్గత అంశం.. దౌత్యపరమైన సంభాషణలను రాజకీయ ప్రయోజనాలకోసం తప్పుడుగా ప్రెజెంట్ చేయరాదు అని ఆయన వ్యాఖ్యానించారు.
అటు శివసేన డిప్యూటీ లీడర్ ప్రియాంక చతుర్వేది కూడా కెనడా ప్రధాని వ్యాఖ్యలపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర దేశాలను ఇండియా ఎప్పుడూ గౌరవిస్తుందని, ఆ గౌరవాన్ని ఆయా దేశాలు నిలుపుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. మన దేశ అంతర్గత వ్యవహారం పై ఇతర దేశాలు ఇంకా నోరెత్తకముందే ప్రధాని మోదీ..రైతుల సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆయన కోరారు. ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా కూడా కెనడా పీఎం వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఈ విధమైన వ్యాఖ్యలు స్వాగతించదగినవి కావన్నారు. ఇది అనుచితం కూడా అని ఆయన ట్వీట్ చేశారు.
ఇండియాలో రైతుల ఆందోళనను తాము సమర్థిస్తున్నామని, శాంతియుత నిరసనకు తమ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని జస్టిన్ ట్రూడో పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే బ్రిటన్ లోని కొందరు ఎంపీలు కూడా రైతుల ఆందోళనను సమర్థిస్తూ ట్వీట్లు చేశారు.