ఇన్ఫార్మర్గా మారండి.. నల్లధన కుబేరులను కనిపెట్టండి.. రూ. 5 కోట్ల రివార్డును పొందండి.!!
Income Tax Department: ఆదాయపు పన్నుశాఖ తాజాగా కొత్త ఆన్లైన్ సదుపాయాన్ని మొదలుపెట్టింది. దీని ద్వారా అక్రమ ఆస్తి, బినామీ ఆస్తి, లేదా...
Income Tax Department: నల్లధన కుబేరులపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఆదాయపు పన్నుశాఖ తాజాగా కొత్త ఆన్లైన్ సదుపాయాన్ని మొదలుపెట్టింది. దీని ద్వారా సామాన్యులు ఎవరైనా కూడా బడాబాబుల అక్రమ ఆస్తి, బినామీ ఆస్తి, లేదా విదేశాల్లో దాచుకున్న డబ్బులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వొచ్చు. ఇందులో భాగంగానే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్(సీబీడీటీ) తమ ఈ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometaxindiaefiling.gov.inలో “submit tax evasion petition or benami property holding” అనే లింక్ను ప్రారంభించింది.
ఈ సౌకర్యం ద్వారా పాన్/ఆధార్ కార్డు ఉన్నా, లేకపోయినా కూడా ఫిర్యాదు చేయవచ్చు. OTP ఆధారిత చట్టబద్దమైన ప్రక్రియ పూర్తయిన అనంతరం ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1961, అన్డిసక్లోజ్డ్ ప్రాపర్టీ లా, బినామీ లావాదేవీల ఎగవేత చట్టం కింద మూడు వేర్వేరు రూపాల్లో ఫిర్యాదులను దాఖలు చేయవచ్చునని సీబీడీటీ తెలిపింది. ఒక్కసారి ఫిర్యాదు నమోదు కాగానే.. ప్రతీ కంప్లయింట్కు ఆదాయపు పన్ను శాఖ ఓ ప్రత్యేక నెంబర్ను కేటాయిస్తుంది. దాని ద్వారా ఫిర్యాదుదారుడు తమ ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ను ఓ వెబ్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ సదుపాయంతో ఏ వ్యక్తి అయినా కూడా ఇన్ఫార్మర్గా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా అతనికి రివార్డు కూడా లభిస్తుంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బినామీ ఆస్తి వివరాలకు రూ. 1 కోటి వరకు, పన్ను ఎగవేత, నల్లధనం వివరాలకు రూ .5 కోట్ల వరకు రివార్డులు పొందవచ్చు. వాటికి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని నేరుగా ఆదాయపన్ను కార్యాలయానికి వెళ్లి ఇచ్చినా, మెయిల్ ద్వారా సీబీడీటీ ఇన్వెస్టిగేషన్ సభ్యుడికి పంపవచ్చు. కాగా, పన్నుల ఎగవేత, నల్లధనంపై ఆదాయపు పన్ను శాఖ ప్రజల నుండి “విశ్వసనీయమైన” సమాచారాన్ని కోరుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అవి నేరుస్థులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు ఎంతగానో సాయపడుతుందని భావిస్తున్నారు.