విచిత్రం ఈ నలుగురి కథ.. ఇంతకీ ఏంటంటే?
ఈ నలుగురిది ఒకే సామాజిక వర్గం.. కలిసి మెలిసి ఉండాల్సిన వారు. కానీ వీరిలో ఒక నేత మిగతా ముగ్గురిని తొక్కేస్తున్నారట. కీలక పదవిలో ఉన్న ఆ నాయకుడు మిగతా వారి ఎదుగుదలకు చెక్ పెట్టేస్తున్నారట. తన సామాజికవర్గం నుంచి తాను మాత్రమే చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఈ నలుగురిలో ఆ ఒక్కరు ఎవరు? స్వామిగౌడ్.. తెలంగాణ ఏర్పడక ముందు టిఎన్జీవోల నాయకుడు. ఏర్పడిన తర్వాత శాసన మండలి తొలి ఛైర్మన్. […]
ఈ నలుగురిది ఒకే సామాజిక వర్గం.. కలిసి మెలిసి ఉండాల్సిన వారు. కానీ వీరిలో ఒక నేత మిగతా ముగ్గురిని తొక్కేస్తున్నారట. కీలక పదవిలో ఉన్న ఆ నాయకుడు మిగతా వారి ఎదుగుదలకు చెక్ పెట్టేస్తున్నారట. తన సామాజికవర్గం నుంచి తాను మాత్రమే చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఈ నలుగురిలో ఆ ఒక్కరు ఎవరు?
స్వామిగౌడ్.. తెలంగాణ ఏర్పడక ముందు టిఎన్జీవోల నాయకుడు. ఏర్పడిన తర్వాత శాసన మండలి తొలి ఛైర్మన్. శ్రీనివాస్గౌడ్.. తెలంగాణ ఏర్పడక ముందు టిజివో నేత…ఏర్పడిన తర్వాత తొలుత ప్రభుత్వ విప్.. ఆ తర్వాత రాష్ట్ర మంత్రి. పద్మారావు గౌడ్.. తెలంగాణ ఏర్పడక ముందు నుంచి ఎమ్మెల్యే. ఆ తర్వాత కెసీఆర్ తొలి మంత్రి వర్గంలో మంత్రి కూడా. ప్రస్తుతం శాసనసభ డిప్యూటీ స్పీకర్. బూర నర్సయ్య గౌడ్.. తెలంగాణ ఏర్పాటు కాక ముందు తెలంగాణ వైద్యుల జెఎసీ నేత.. ఏర్పాటయ్యాక ఒక టర్మ్ లోక్సభ సభ్యుడు.
ఒకప్పుడు పలు కారణాల వల్ల అంతా ఒక్కటిగా కనిపించిన ఈ నలుగురు నేతలు ఇప్పుడు వేర్వేరు పంథాలో కొనసాగుతున్నారు. ఈ నలుగురు నాయకుల్లో శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కేబినెట్లో ఉండగా.. పద్మారావుగౌడ్ ఉపసభాపతిగా శాసనసభలో ఉన్నారు. మరో ఇద్దరు స్వామిగౌడ్, బూర నర్సయ్యగౌడ్ మాత్రం పదవులు లేక సైలెంట్ అయ్యారు.
పద్మారావు గౌడ్కు పదవి వున్నా పొలిటికల్గా ఈ ముగ్గురు నాయకులు యాక్టివ్గా లేరు. దీంతో ఇదే అడ్వాంటేజ్గా మంత్రి శ్రీనివాస్గౌడ్ ముందుకు వెళుతున్నారట. మిగతా ముగ్గురు నాయకులను రాజకీయంగా ఉనికిలో లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన సామాజిక వర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇంతకుముందు గౌడ సామాజిక వర్గం నుండి అయినా, ఉద్యోగుల సంఘాల నుండి అయినా శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కీలకంగా ఉండేవారు. అయితే స్వామి గౌడ్ పదవి కాలం పూర్తి కావడం..తిరిగి ఆయనకు గులాబీ బాస్ ఎలాంటి పదవి కట్టబెట్టకపోవడం తో సైలెంట్ అయ్యారు. రెండో సారి ఎమ్మెల్యే గా గెలిచిన శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయ్యారు. దీంతో తన సొంత సామాజిక వర్గం లో పట్టు సాధించారు. మిగతా నేతలు తనకు పోటీకి రాకుండా స్కెచ్లు వేస్తున్నారనేది కొందరి మాట. ఇందులో భాగంగానే స్వామి గౌడ్కి ఎలాంటి పదవీ రాలేదని చర్చ జరుగుతోంది.
అటు పద్మారావు గౌడ్ మొదటి నుండి టిఆర్ఎస్లో ఉన్నారు. తెలంగాణ తొలి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. కానీ రెండో మంత్రివర్గంలో చోటు దక్కలేదు. రెండవ సారి గెలిచిన తర్వాత ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. దీంతో అసంతృప్తితో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. అటు భువనగిరి ఎంపీ ఎన్నికల్లో రెండవ సారి ఒడిపోవడంతో పాటు ఎలాంటి పదవి లేక బూర నర్సయ్య గౌడ్ కూడా పెద్దగా యాక్టివ్గా లేరు. దీంతో ఇప్పుడు ఆ సామాజిక వర్గం మొత్తం మంత్రి శ్రీనివాస్ గౌడ్ చుట్టే తిరగడాన్ని ఆ ముగ్గురు నాయకులు జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది.
మొన్నటికి మొన్న ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కూడా స్వామిగౌడ్ సంఘం అయిన టీఎన్జీవో… శ్రీనివాస్ గౌడ్ సంఘం అయిన టీజీవోల మధ్య భేదాభిప్రాయాలు కూడా వచ్చాయి. ఆ సంఘంతో మనకు పనేంటి అని స్వామిగౌడ్ అనుచరులు అన్నారట. అయితే ఈ ముగ్గురు నేతలతో గ్యాప్ విషయం తెలిసిన శ్రీనివాస్ గౌడ్ వారిని కూల్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే పద్మారావును ఒకసారి కలిశారు. మరోసారి ఆయన్ని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. మిగతా నేతలను కూడా త్వరలోనే కలుస్తారని ప్రచారం జరుగుతోంది.