అప్పట్లో పెళ్లి చేసుకుంటే దేవుడికి కూడా కట్నం ఇచ్చేవారట !
భారతదేశం విభిన్న ఆచారాలు, సాంప్రదాయాల సమ్మేళనం. అయితే కాలంతో పాటు కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి.
భారతదేశం విభిన్న ఆచారాలు, సాంప్రదాయాల సమ్మేళనం. అయితే కాలంతో పాటు కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. ఏవైనా శాసనాలు, శిలా ఫలకాలు తవ్వకాలు, పరిశోధనల్లో లభిస్తే అప్పటి పద్దతులు, ఆచారాలు తెలుస్తున్నాయి. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీసలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో తాజాగా వెలుగుచూసిన రాతి శాసనం, దేవాలయ భూదానపత్రిక తామ్ర శాసనం.. పురాతన కాలం నాటి అనేక ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది. గతంలో దేవుడి ఉత్సవాలకు, కల్యాణానికి కట్నాలు చెల్లించేవారని తేటతెల్లమైనట్లు తెలంగాణ జాగృతి చరిత్ర బృందం ప్రతినిధి, పురాతత్వ పరిశోధకుడు రామోజు హరగోపాల్ తెలిపారు. కవి, చరిత్రకారుడు కట్టా శ్రీనివాస్ ఇటీవల ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ విశేషాలు వెలుగుచూశాయని వెల్లడించారు.
‘దగ్గర్లోని ఓ ఊరిలో ఉన్న సీతారామచంద్రస్వామి విగ్రహాల్ని మన్నెగూడెం తెచ్చాక కొన్నాళ్లు కైంకర్యాలు ఆగిపోయాయి. దీంతో కొందరు గుడి నిర్మాణానికి భూదానం చేసి విగ్రహాల్ని సంకీసకు రప్పించి ప్రతిష్ఠించారు. భూదాన పత్రం శిథిలం కావడంతో రాగి రేకుపై ఈ విషయాలు రాయించారు’ అని హరగోపాల్ పేర్కొన్నారు. సీతారామచంద్రస్వామి కల్యాణంలో 30 గ్రామాల ప్రజలు పాల్గొనేవారని.. తమ ఇళ్లలో వివాహాలు జరిగితే ఆడపెళ్లివారు అర్ధ రూపాయి, మగపెళ్లివారు రూపాయి వంతున దేవుడికి కట్నమిచ్చేవారని ఆయన బుధవారం వివరించారు.
Also Read :
హెలికాఫ్టర్లో పెళ్లికి వెళ్లిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ… కేసు నమోదు