పబ్జీ గేమ్ నిషేధంపై రోడ్డెక్కిన పాకిస్తాన్ యువత
పబ్జీ వీడియో గేమ్ కారణంగా యువత చెడిపోతున్నదని, వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నదని, విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారని, ఇంకా చాలా చాలా కారణాలు చెప్పి ఆ వీడియో గేమ్ను కాస్తా నిషేధించింది పాక్ ప్రభుత్వం
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్కు ఇప్పుడో కొత్త సమస్య వచ్చిపడింది.. అది కూడా తన సొంత నియోజకవర్గం నుంచే..! పబ్జీ వీడియో గేమ్ కారణంగా యువత చెడిపోతున్నదని, వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నదని, విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారని, ఇంకా చాలా చాలా కారణాలు చెప్పి ఆ వీడియో గేమ్ను కాస్తా నిషేధించింది పాక్ ప్రభుత్వం..ఈ నిర్ణయమే ఇమ్రాన్ఖాన్కు తలనొప్పులు తెచ్చిపెడుతున్నది. కాసింత కాలక్షేపం కోసం వీడియో గేమ్ ఆడటం కూడా తప్పేనా అని నిలదీస్తున్నది యువత.. అక్కడితే ఆగలేదు పంజాబ్-సింధ్ సరిహద్దులో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నాలు కూడా చేస్తోంది.. కొందరైతే ఇస్లామాబాద్ హైకోర్టు గడప కూడా తొక్కారు.. పబ్జీ నిషేధాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఉత్తినే పబ్జీ వీడియో గేమ్ను నిషేధించలేదని, అందులో ఇస్లాంను వ్యతిరేకిస్తూ కొన్ని సన్నివేశాలున్నాయని, అదీకాకుండా శృంగారపరమైన దృశ్యాలు ఉన్నాయని, ఈ కారణాల వల్లే ఆ గేమ్ను నిషేధించామని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ ఇస్లామాబాద్ హైకోర్టుకు నివేదించుకుంది.
పబ్జీ గేమ్ను నిషేధించడం నిజానికి మంచి నిర్ణయమే! ఎంతో మంది యువకుల ఉసురు తీసుకున్నదా గేమ్! ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.. అయినా .. పాక్ యువత మాత్రం నిషేధాన్నే తప్పుపడుతున్నది.. ఆ మాటకొస్తే వీడియో గేమ్స్ను బ్యాన్ చేయడమన్నది పాకిస్తాన్లో ఇది మొదటిసారేం కాదు.. ఇంతకు ముందు మూడేళ్ల కిందట కాల్ ఆఫ్ డ్యూటీ, మెడల్ ఆఫ్ హానర్, వాల్కైరీ డ్రైవ్: భిక్కూని అన్న వీడియో గేమ్లను కూడా పాకిస్తాన్ నిషేధించింది.. ఆ నిషేధానికి కారణాలు వేరే ఉన్నాయి.. కాల్ ఆఫ్ డ్యూటీ, మెడల్ ఆఫ్ హానర్లలో పాకిస్తాన్ను కించపరిచే సన్నివేశాలున్నాయి.. టెర్రరిస్టుల అడ్డా పాకిస్తాన్ అని, ఐఎస్ఐ టెర్రరిస్టులకు మద్దతునిస్తోందని ఆ గేమ్ల్లో చెప్పారట! ఇక వాల్కైరీ డ్రైవ్: భిక్కూని కథ వేరు! అందులో మితిమీరిన శృంగారం ఉందట!
పబ్జీకి అడిక్టయిన పాక్ యువత
పాకిస్తాన్లో పబ్జీ గేమ్కు చాలా మంది అడిక్ట్ అయ్యారు.. ఆకస్మాత్తుగా ఈ గేమ్ను బ్యాన్ చేయడంతో చాలా మంది మానసికస్థితిని కోల్పోయారు.. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు.. వసంతకాలంలో అక్కడ పతంగులు ఎగరేయడం సంప్రదాయం.. లాహోర్లో కైట్ ఫెస్టివల్ చాలా గొప్పగా జరుగుతుంటుంది.. పతంగులు ఎగరేసే దారం కారణంగా జనం చనిపోతున్నారని 2005లో పాకిస్తాన్ సుప్రీంకోర్టు బసంత్ ఫెస్టివల్ను బ్యాన్ చేసింది.. అప్పుడు కూడా ఇదే జరిగింది.. సుప్రీంకోర్టు నిర్ణయంపై యువత మండిపడింది.. బలహీనమనస్కులు కొందరు ప్రాణాలు కూడా తీసుకున్నారు.. ఇప్పుడు కూడా పాకిస్తాన్లో అదే జరుగుతోంది. లాక్డౌన్ కాలంలో చాలామంది పబ్జీ ఆటలో మునిగితేలారు.. అలా పూర్తిగా దానికి బానిసలయ్యారు.. కాలక్షేపాన్ని ఇచ్చే ఆటను నిషేధించడమేమిటని యువత ప్రశ్నిస్తోంది.. ప్ల కార్డులతో నిరసన తెలుపుతోంది.. సోషల్ మీడియాల్లో అయితే పెద్ద ఉద్యమమే నడుస్తోంది.. ఇప్పుడు ఇమ్రాన్ సర్కారు యువత మనోభావాలను గుర్తిస్తుందా? నిషేధాన్ని గట్టిగా అమలు చేస్తుందా?