ICC Team of the Decade: ఆ విషయాన్ని ఐసీసీ మర్చిపోయినట్లుంది.. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆగ్రహం..
ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్దపు టీ20, వన్డే, టెస్టు జట్లలో పాకిస్తాన్ స్కిప్పర్ బాబర్ అజమ్కు చోటు కల్పించకపోవడంతో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్..
ICC Team of the Decade: ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్దపు టీ20, వన్డే, టెస్టు జట్లలో పాకిస్తాన్ స్కిప్పర్ బాబర్ అజమ్కు చోటు కల్పించకపోవడంతో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజా జట్లను చూస్తుంటే ఐపీఎల్ టీమ్ను ప్రకటించినట్లుగా ఉందంటూ విమర్శలు గుప్పించాడు. ‘ఐసీసీ ప్రకటించిన ఏ ఫార్మాట్లోనూ పాకిస్తాన్ ప్లేయర్లకు చోటు దక్కలేదు. మహిళల జట్లలోనూ అదే పరిస్థితి కనిపించింది. పాకిస్తాన్ టీ20 ఆడుతుందని, అలాగే ఐసీసీలో పాకిస్తాన్ సభ్యత్వం కలిగి ఉన్నదనే విషయాన్ని ఐసీపీ మర్చిపోయినట్లుంది. ప్రస్తుత టీ20 ర్యాంకింగ్లో నెంబర్ వన్ అయిన బాబర్ అజమ్ను జట్టులోకి తీసుకోకపోవడం ఏంటి? ఐసీసీ ప్రకటించిన దశాబ్దపు టీ20, వన్డే, టెస్టు జట్లను పరిగణనలోకి తీసుకోబోము. ఎందుకంటే ఐసీసీ ప్రకటించింది కేవలం ఐపీఎల్ టీమ్ను మాత్రమే. ప్రపంచ జట్టును కాదు.’ అని ఐసీసీ తీరును షోయబ్ తూర్పారబట్టారు.
‘ఐసీసీ కేవలం డబ్బు, స్పాన్సర్షిప్, టీవీ రైట్స్ గురించి మాత్రమే ఆలోచించినట్లుంది. తాజాగా ప్రకటించిన జట్లలో డెన్నీస్ లిల్లీ ఎక్కడ? జెఫ్ థామ్సన్, వసీమ్ అక్రమ్, వఖార్ ఎందుకు లేరు? సదరు జట్టులో ఫాస్టెస్ట్ బౌలర్లు, లెగ్ స్పిన్నర్స్ కనిపించడం లేదేంటి?’ అంటూ ఐసీసీపై ప్రశ్నల వర్షం కురిపించాడు. అంతేకాదు.. ఐసీసీ పూర్తిగా కమర్షియల్ అయిపోయిందని విమ్శించాడు. 1970 లో క్రికెట్కి, నేటి క్రికెట్కి చాలా వ్యత్యసాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్దపు టీ20, వన్డే, టెస్టు జట్లలో టీమిండియా ఆటగాళ్లకు పెద్దపీట దక్కిన విషయం తెలిసిందే. మూడు జట్లలోనూ భారత ఆటగాళ్లకు చోటు లభించగా, మూడు జట్లకూ ఇండియన్లే కెప్టెన్గా ఉండడం మరో విశేషం. ఈ దశాబ్దపు టీ20, వన్డే జట్లకు టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీని కెప్టెన్గా నియమించగా, టెస్టు జట్టుకు టీమిండియా ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది. ఇక ఈ దశాబ్దపు టీ20 జట్టులో మొత్తం నలుగురు భారత ఆటగాళ్లకు చోటు లభించింది. మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు చోటు లభించగా, వన్డే జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలను తీసుకుంది. అలాగే, టెస్టు జట్టులో విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్లకు చోటు లభించింది. టీ20, వన్డే, టెస్టు జట్లు మూడింటిలోనూ టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి చోటు లభించడం విశేషం.
Also read:
సంక్రాంతికి సందడి చేయనున్న బెల్లంకొండ శ్రీనివాస్.. ‘అల్లుడు అదుర్స్’ అనిపిస్తాడా..?