అంతా రెడీ.. రేపటి నుంచి మెట్రో పరుగు
హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు రేపటి నుంచి తీరనున్నాయి. అన్లాక్-4 మార్గదర్శకాలను అనుసరించి నగరంలో మెట్రో రైళ్ల ప్రారంభానికి హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు...
Hyderabad Metro Train : హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు రేపటి నుంచి తీరనున్నాయి. అన్లాక్-4 మార్గదర్శకాలను అనుసరించి నగరంలో మెట్రో రైళ్ల ప్రారంభానికి హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెట్రో స్టేషన్లలో, రైళ్లలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనెల 7వ తేదీ నుంచి మెట్రో రైల్ సేవలు నగరవాసులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు మెట్రో స్టేషన్లోకి వచ్చిన వెంటనే థర్మల్ స్క్రీనింగ్, శానిటైజ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ప్రయాణికుడిని థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తామని సిబ్బంది చెబుతున్నారు.
కరోనా నేపథ్యంలో మెట్రో స్టేషన్లలో టోకెన్ల జారీ ప్రక్రియను పూర్తిగా రద్దు చేశారు. స్మార్ట్ కార్డు లేదా ఆన్లైన్లో బుక్ చేసుకుని క్యూఆర్ కోడ్ ద్వారా ప్రయాణించే అవకాశం కల్పించారు. కౌంటర్ వద్ద కూడా భౌతికదూరం పాటించే విధంగా మార్కింగ్ వేశారు. రైళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని నిర్ణయించారు.
మెట్రో సిబ్బందికి పీపీఈ కిట్లు సమకూర్చారు. సీసీటీవీల ద్వారా ఎప్పటికప్పుడు ప్రయాణికుల రాకపోకలను గమనిస్తూ భౌతికదూరం పాటించని వారిని అప్రమత్తం చేస్తామని అధికారులు తెలిపారు. రైళ్లలో సీటింగ్ విధానంలో కూడా మార్పులు చేశారు. ప్రతి బోగీలో ప్రయాణికులు నిల్చునే, కూర్చునే చోట మార్కింగ్ వేశారు.