New Record: చిన్న ప్రోత్సాహం.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన 15 ఏళ్ల తెలుగు కుర్రాడు..
New Record: ప్రతి వ్యక్తికీ తనకంటూ ఒక కల ఉంటుంది. అందరూ తమ కలల్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు..
New Record: ప్రతి వ్యక్తికీ తనకంటూ ఒక కల ఉంటుంది. అందరూ తమ కలల్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు తమ కలల్ని తమ పిల్లలపై రుద్దుతూ ఉంటారు. పిల్లల ఆసక్తి, అభిరుచి పట్టించుకోకుండా తాము చెప్పిందే చదవాలని పట్టుబడుతూ ఉంటారు. ఫలితంగా ఆ చిన్నారులు తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్కు గురవుతున్నారు. కొందరు ఇల్లొదిలి పారిపోతుంటే, మరికొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈ అంశం 10వ తరగతి చదివి ఇంటర్మీడియట్లో చేరబోతున్న ఆశిష్ను కలచివేసింది. తన విషయంలో తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోగా, తన అభిరుచిని ప్రోత్సహిస్తున్నప్పటికీ.. మిగతా తల్లిదండ్రుల్లోనూ మార్పు తీసుకురావాలని అనుకున్నాడు. ఆ మార్పు కోసం ఏకంగా ఓ సాహసయాత్రనే తలపెట్టాడు.
సైక్లింగ్పై ఆసక్తి ఉన్న ఆశిష్.. జులైలో చెన్నై నుంచి సైకిల్పై బయల్దేరి 41 రోజుల్లో లద్దాఖ్ రాజధాని లేహ్ చేరుకున్నాడు. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలన్నదే తన యాత్ర ముఖ్యోద్దేశమని ఆశిష్ చెబుతున్నాడు. ఈ క్రమంలో మైదాన ప్రాంతంలో ప్రతి రోజూ 120 కి.మీ నుంచి 150 కి.మీ దూరం ప్రయాణించేవాడినని, తనతో పాటు తెచ్చుకున్న టెంట్లోనే విశ్రమించేవాడినని చెప్పాడు. చంఢీగఢ్ నుంచి పర్వత ప్రాంత ప్రయాణం మొదలయ్యాక ప్రతికూల వాతావరణం, ఆపై వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడ్డానని, అయినప్పటికీ ఎక్కడా వెనుకడుగు వేయకుండా తన యాత్రను కొనసాగించానని వివరించాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలన్నదే తన డ్రీమ్ అని ఆశిష్ చెబుతున్నాడు. తనపై తల్లిదండ్రులెప్పుడూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాడు.
యాత్రను పూర్తిచేసి తిరుగుప్రయాణంలో ఢిల్లీకి చేరుకున్న ఆశిష్, అతని తల్లిదండ్రులు టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. తన తదుపరి లక్ష్యం చెన్నై నుంచి లండన్కు సైకిల్ యాత్ర చేపట్టడమేనని ఆశిష్ చెబుతున్నాడు. పిల్లల అభిరుచిని, ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించడమే ఉత్తమమని తల్లిదండ్రులిద్దరూ చెబుతున్నారు. కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఈ కుటుంబం వ్యాపారరీత్యా చెన్నైలో స్థిరపడ్డామని, పిల్లలిద్దరినీ వారికి నచ్చినరీతిలో ముందుకెళ్లేందుకు ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు. తమ కుటుంబంలో తల్లిదండ్రుల ఒత్తిడితో ఇష్టం లేని చదువు చదువుకుంటూ ఇబ్బందులు పడ్డ పిల్లల్ని చూశామని, ఆ పరిస్థితి మరొకరికి రానివ్వకూడదనే తమ కుమారుడి సాహసయాత్ర ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటున్నామని అన్నారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..