Breaking news రాష్ట్రాలకు హోంశాఖ వార్నింగ్.. ఆ వార్తలపై జర జాగ్రత్త
తప్పుడు వార్తలపై కేంద్ర హోం శాఖ మళ్ళీ హెచ్చరికలు జారీ చేసింది. రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే వారి పట్ల మరింత కఠినంగా వుండాలని ఆదేశాలు జారీ చేసింది. అవాస్తవ వార్తలపై సమరానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
Home ministry warns states: తప్పుడు వార్తలపై కేంద్ర హోం శాఖ మళ్ళీ హెచ్చరికలు జారీ చేసింది. రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే వారి పట్ల మరింత కఠినంగా వుండాలని ఆదేశాలు జారీ చేసింది. అవాస్తవ వార్తలపై సమరానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిక ప్రాంతాలకు హోం శాఖ లేఖ రాసింది. త్వరలోనే వాస్తవాలతో ప్రత్యక పోర్టల్ని అందుబాటులోకి తెస్తామని తెలియజేసింది.
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా కొన్ని అవాస్తవ వార్తలు ప్రచారంలోకి రావడంపై ఇటీవల సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇలాంటి అవాస్తవ వార్తలను నియంత్రించేందుకు గాను.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు కొనసాగింపుగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిక ప్రాంతాలకు బల్లా ఒక లేఖ రాశారు.
అవాస్తవ వార్తలతో పోరాడేందుకు, ఇలాంటి వార్తలు విరివిగా ప్రచారంలోకి రాకుండా ఉండేందుకు గాను తగిన చర్యలు చేపట్టాలని హోం శాఖ కార్యదర్శి ఆ లేఖలో కోరారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకొనేందుకు, ధ్రువీకరించుకోకుండానే ప్రచారంలోకి వస్తున్న వార్తల్లో వాస్తవాలను తెలియపరిచేందుకు గాను భారత ప్రభుత్వం వెబ్పోర్టల్ని రూపొందిస్తున్నట్టు హోం శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. అవాస్తవ వార్తలకు వివరణలను ఇచ్చేందుకు వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకుగాను రాష్ట్రాలు, కేంద్రపాలిక ప్రాంతాలు కూడా ఇలాంటి వ్యవస్థలనే ఏర్పాటు చేసుకోవాలని కూడా హోంశాఖ సూచించింది.
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వలస కార్మికులు భారీగా తమ తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని.. లాక్ డౌన్ మరో మూడు నెలలకు పైగానే కొనసాగే అవకాశం ఉందంటూ మీడియాలో వస్తున్న వార్తలు వలసదారుల్లో తెలియని ఆందోళన, భయాలకు దారి తీస్తోందంటూ అత్యున్నత న్యాయస్థానంలో ఇటీవల ఒక రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. నిజమేంటో క్రాస్ చెక్ చేసుకోకుండా మీడియాలో వస్తున్న వార్తలు ప్రజల్ని చెప్పలేని భయాందోళనకు గురి చేస్తున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వాస్తవాలను నిర్ధారణ చేసుకున్న తరువాతే మీడియా సంస్థలు వార్తలను ప్రచారం లేదా ప్రసారం చేయాలని ఆదేశాలను జారీ చేసింది. దీనికి తోడు వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలలో ఎన్డీఎంఏ, కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు తగిన ఆహారం, మందులు, ఇతర ప్రాథమిక సదుపాయాల్ని కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.